- ఇక విలేజ్ కరెంట్ ఆఫీసర్!
- రైతు డిస్కంలో పనిచేసేందుకు లోకల్ ఎలక్ట్రీషియన్లకు చాన్స్
- ఔట్సోర్సింగ్ కింద తీసుకోవాలని సర్కార్ యోచన
- రాష్ట్రంలో కొత్తగా 12 వేల మందికి ఉపాధి
- గ్రామాల్లో ఎక్కడ కరెంట్ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం
- రైతులకు మేలు జరిగే అవకాశం
హైదరాబాద్, వెలుగు: గ్రామాల్లోకి త్వరలో ‘విలేజ్ కరెంట్ ఆఫీసర్లు’ రాబోతున్నారు. కొత్తగా రైతు డిస్కం ఏర్పాటుచేశాక వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తోంది. ఔట్ సోర్సింగ్ కింద లోకల్ ఎలక్ట్రీషియన్లకు అవకాశం కల్పించి, నెలకు రూ.15 వేల కనీస వేతనం ఇవ్వాలని భావిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా రైతులకు మేలు జరగడంతో పాటు రాష్ట్రంలో కొత్తగా 12 వేల మందికి ఉపాధి దొరుకుతుంది.
వ్యవసాయానికి క్వాలిటీ కరెంట్అందించేందుకే.. రైతు డిస్కంలో పనిచేయడానికి ఇప్పటివరకు 2 వేల మంది ఉద్యోగులను మాత్రమే తీసుకున్నారు. ఇందులో క్షేత్ర స్థాయి సిబ్బంది వెయ్యి మందే ఉన్నారు.
వీరంతా పర్మినెంట్ ఉద్యోగులు. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ఏర్పడే సమస్యలను ఈ కొద్ది మందితో పరిష్కరించడం కష్టమని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఫ్యూజులు కాలిపోయినా, లైన్లు తెగిపడినా త్వరగా రిపేర్ చేయడం వీలు కాదని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు విద్యుత్ సంఘాల ప్రతినిధులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇటీవల ఈఆర్సీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ అవసరాలను తీర్చేందుకు గ్రామానికో కరెంట్ ఆఫీసర్ను నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు.
గ్రామానికో విలేజ్కరెంట్ఆఫీసర్ చొప్పున12 వేల మందిని ఔట్ సోర్సింగ్ కింద నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్లు వివరిస్తున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేల చొప్పున వేతనం అందించినా.. ప్రతి నెలా రూ.18 కోట్ల చొప్పున ఏడాదికి రూ.216 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగుల జీతాలతో పోల్చుకుంటే ఇదేమంత భారీ మొత్తం కాదని అంటున్నారు.
లోకల్ ఎలక్ట్రీషియన్లకు అవకాశంరాష్ట్రంలో 12,728 గ్రామాలు ఉన్నాయి. పల్లెల్లో కరెంట్ పని తెలిసిన చాలా మంది యువకులు ఉన్నారు. ఇలాంటి లోకల్ ఎలక్ట్రీషియన్లను రైతు డిస్కంలో పనిచేసేందుకు ఔట్ సోర్సింగ్ కింద నియమించుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. మోటార్ల వద్ద కరెంట్ రాకపోవడం, ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజులు పాడవడం వంటి చిన్న చిన్న పనులను వీరితో చేయించవచ్చని చెబుతున్నారు. భారీ వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురుగాలులు వచ్చి లైన్లు తెగిపోవడం, స్తంభాలు పడిపోవడం వంటి ఏదైనా పెద్ద, పెద్ద సమస్యలు ఉత్పన్నమైతే మండలంలో పనిచేసేవారందరినీ ఒకే చోటికి రప్పించి త్వరగా రిపేర్లు చేసి రైతులకు సత్వరమే కరెంట్ అందుబాటులోకి తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు విద్యుత్ అధికారుల మధ్య చర్చ జరుగుతోంది.
డీటీఆర్లపై మీటర్లకు త్వరలో టెండర్లు రాష్ట్రంలో 30.33 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 5.22 లక్షల డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫార్మర్లు, 2.61 లక్షల కిలోమీటర్ల ఎల్టీ లైన్లు ఉన్నాయి.
వీటిని సదరన్, నార్త్డిస్కంల నుంచి రైతు డిస్కంలోకి మళ్లించారు. రైతు డిస్కంకు ఈఆర్సీ నుంచి లైసెన్స్ మంజూరు కాగానే డిస్కం సేవలు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. ఆ వెంటనే డీటీఆర్లపై మీటర్లు ఏర్పాటు చేయడానికి టెండర్లు పిలవాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. ఒక్కో డీటీఆర్పై రూ.25 వేలతో స్మార్ట్ మీటర్ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.1,306 కోట్లు ఖర్చుచేయనున్నారు. టెండర్ దక్కించుకున్న కంపెనీలకే ప్రతి నెలా మీటర్ రీడింగ్ తీసే బాధ్యతలు అప్పగించడంతో పాటు ఆ కంపెనీ సిబ్బందితోనే గ్రామాల్లో పని చేయించేలా సర్కారు సెకండ్ ప్లాన్ సైతం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్లాలన్న విషయం ఈఆర్సీ లైసెన్స్ మంజూరైన తర్వాతే తేలనుందని నిపుణులు చెబుతున్నారు.
