ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు : పాలమూరు యూనివర్సిటీ 3వ కాన్వకేషన్​డే ఈ నెల 24న నిర్వహిస్తామని వీసీ ప్రొఫెసర్​ లక్ష్మీకాంత్​రాథోడ్ తెలిపారు. మంగళవారం కాన్వకేషన్​డే ఏర్పాట్లపై పీయూ మీటింగ్ హాల్​లో ప్రెస్​మీట్​నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి  గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్​లర్ ​తమిళిసై సౌందరరాజన్ అధ్యక్షత వహిస్తారని, హెచ్​సీయూ వీసీ బీజే రావు స్నాతకోత్సవ ఉపన్యాసం  చేయనున్నారని తెలిపారు.  ఈ సందర్భంగా  పీహెచ్​డీ చేసిన  ఆరుగురికి  పట్టాల ఇవ్వడంతో పాటు 75 మంది స్టూడెంట్లకు గోల్డ్ మెడల్స్, 2,932 మంది పీజీ , 30,645 యూజీ స్టూడెంట్లకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారన్నారు.   పీయూకు ‘న్యాక్’ గుర్తింపు మొదటి దశను సక్సెస్​గా పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి  మళ్లీ  ‘న్యాక్’ గుర్తింపునకు సిద్ధమవుతున్నట్లు  వెల్లడించారు. ఇటీవలే సెంట్రల్ టీం పీయూలో పర్యటించి వెళ్లిందన్నారు. ప్రస్తుతం  పీయూలో1,800 మంది విద్యార్థులు ఉన్నారని, 18 డిపార్ట్​మెంట్లు పనిచేస్తున్నాయన్నారు.  పీయూలో వచ్చే ఏడాది నుంచి యోగా డిప్లమా కోర్సును  ప్రారంభించనున్నామన్నారు.  పీయూ  రిజిస్ట్రార్ ​గిరిజా మంగతాయారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ కె. రాజశేఖర్, ప్రిన్సిపాల్​డాక్టర్ ఎన్. కిషోర్,  ఓఎస్డీ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్ రీసెర్చ్​సెల్ ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.  

అభివృద్ధి పనులను స్పీడప్​చేయాలి : కలెక్టర్​ కోయ శ్రీహర్ష

నారాయణపేట, వెలుగు: మున్సిపాలిటీలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు స్పీడప్​చేయాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. మంగళవారం  కలెక్టరేట్ కాన్ఫరెన్స్​హాల్​లో అధికారులతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  ‘పేట’, మక్తల్, కోస్గిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.  మున్సిపాలిటీల్లో  శానిటేషన్​ పనులు పెండింగ్​పెట్టకుండా, రోజూ చెత్తను సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.  జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్ పనులను వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. మిషన్​భగీరథ పనులు పూర్తిచేసి మక్తల్, కోస్గిలలో కూడా నీళ్లు అందించాలన్నారు. దోబీఘాట్​నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. అడిషనల్​కలెక్టర్  మయాంక్​మిట్టల్, ఇంజినీర్​విజయ భాస్కర్  పాల్గొన్నారు.  

క్రీడాప్రాంగణాలు వెంటనే పూర్తి చేయాలి : కలెక్టర్ షేక్ యాస్మిన్​ బాషా

వనపర్తి, వెలుగు: తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, హరితహారం, ఈజీఎస్  తదితర అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను  ఆదేశించారు. మంగళవారం  కలెక్టరేట్​లో అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్​అధికారులతో రివ్యూ మీటింగ్​నిర్వహించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ క్రీడా ప్రాంగణాల పనులను వెంటనే పూర్తిచేయాలని, హరితహారం మొక్కలకు బ్యాగులు నింపే పనుల్లో ఆలస్యమవుతోందని వెంటనే పూర్తి చేయాలన్నారు. మెగా పల్లె ప్రకృతి వనాలను సంరక్షించాలని, రోజూ క్రమం తప్పక నీరు పట్టాలని కలెక్టర్​సూచించారు. అడిషనల్​కలెక్టర్​ఆశీష్​సంగ్వాన్​, జడ్పీ సీఈవో వెంకట్ రెడ్డి, డీఆర్డీవో నరసింహులు తదితరులు పాల్గొన్నారు..

ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి : ఎస్పీ అపూర్వరావు

పెబ్బేరు, వెలుగు : పెబ్బేరు పీఎస్​పరిధిలో నమోదైన  గ్రేవ్  కేసుల్లో  ఎంక్వైరీ  స్పీడప్​చేసి నిందితులను రిమాండ్​కు పంపాలని ఎస్పీ అపూర్వరావు ఆదేశించారు.  వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం పెబ్బేరు పీఎస్​ను విజిట్​చేసి రికార్డులు చెక్​చేశారు. ఎస్సై రామస్వామిని కేసుల వివరాలను  అడిగి తెలుసుకున్నారు. గ్రేవ్ కేసుల సీడీ ఫైల్స్ , క్రైమ్ మెమోస్, క్రైమ్ డైజెస్ట్ రికార్డులను, పిటీ కేస్ ఫైల్స్, యూఐ కేసుల ఫైల్స్ ను  పరిశీలించారు. కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలని,  ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా ఎస్పీ పోలీసులను ఆదేశించారు.  హైవేలపై రాత్రివేళలో తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు. పెబ్బేరు పట్టణంలో ట్రాఫిక్ కంట్రోల్​కు  ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. డీఎస్పీ ఆనంద్ రెడ్డి, కొత్తకోట సీఐ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్కింగ్ ​స్థలాలను గుర్తించాలి : సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి 

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు: పట్టణంలో వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ స్థలాలను గుర్తించి, అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి మున్సిపల్ ఆఫీసర్లను ఆదేశించారు.  బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  వేసిన పీఎల్​సీ కేసు గురించి మంగళవారం న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, టౌన్ ప్లానింగ్  ఆఫీసర్​శ్రీకాంత్ తో సమీక్షించారు. 15 రోజుల్లో పార్కింగ్ స్థలాల ఏర్పాటు, ఫుట్ పాత్  ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ జడ్జి కి తెలిపారు . 

రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకోవాలి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నెలల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడే కక్షిదారులు రాజీమార్గంలో  పరిష్కరించుకోవడం ఉత్తమమని నాగర్ కర్నూల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌ జడ్జి  కె.స్వరూప  సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని శ్రీపురం పంచాయతీ ఆవరణలో లీగల్ సెల్ జిల్లా కోర్టు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. హాజరైన ఆమె మాట్లాడుతూ పేదవారికి కోర్టుల ద్వారా ఉచిత న్యాయ సాయం అందిస్తున్నామని, తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండి రూ.3లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అప్లై చేసుకోవాలని చెప్పారు.  

25న జాబ్​మేళా

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలోని నిరుద్యోగులకు ఈ నెల 25న జిల్లా  ఎంప్లాయిమెంట్​ఆఫీస్​మెట్టుగడ్డ వద్ద జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ మహమ్మద్ పాషా తెలిపారు. మహబూబ్ నగర్, జడ్చర్ల కంపెనీల్లో పని చేసేందుకు  టెన్త్​, ఇంటర్, డిగ్రీ, బీఫార్మసీ, డీఫార్మసీ, ఎంఫార్మసీ చదివి 18 –30 ఏండ్ల వయస్సులోపు ఉన్న వారు అర్హులన్నారు. ఎంపికైన వారికి 8,500  నుంచి 20వేల వరకు జీతం ఉంటుందన్నారు. వివరాలకు 9550205227,9948568830 నంబర్లను సంప్రదించాలన్నారు.

అప్పు వసూలు చేసిందన్న కక్షతో హత్య

వనపర్తి, వెలుగు: అప్పు వసూలు చేసిందన్న కక్షతోనే వృద్ధురాలి హత్య జరిగిందని ఎస్పీ అపూర్వరావు తెలిపారు. ఈ నెల 7న వనపర్తిలోని బ్రాహ్మణ వీధిలో జరిగిన హత్య కేసు వివరాలను మంగళవారం ఎస్పీ మీడియాకు వివరించారు. కాలనీలో వరలక్ష్మి(68)  వడ్డీలకు అప్పులిస్తూ జీవించేది. ఈ క్రమంలో  దూరపు బంధువులైన పొలిశెట్టి శశికళ కు రెండేండ్ల కింద రూ.2లక్షలు  అప్పుగా ఇచ్చింది.  అప్పును చెల్లించే క్రమంలో వరలక్ష్మి కి శశికళ కు గొడవ జరిగి పీఎస్​వరకు వెళ్లింది. రూ.2లక్షల అసలుతో  పాటు రూ. 70 వేలు వడ్డీ కాగా, వడ్డీని రూ.30 వేలు తగ్గించి ఇచ్చేలా పోలీసులు రాజీ కుదిర్చారు. దీంతో వరలక్ష్మి శశికళను సూటిపోటి మాటలు అంటుండేది. ఆమెపై కక్ష పెట్టుకున్న  శశికళ కుమారుడు పొలిశెట్టి బాలకృష్ణ , తెలిసిన బంధువులతో కలిసి  ఆమెను చంపేందుకు ప్లాన్​వేసింది. కర్నూలు జిల్లాలోని బూడిదపాడు గ్రామానికి చెందిన తరుణ్ కుమార్(25), బేతంచర్ల మండలం మర్రికుంట కు చెందిన నాకెళ్ల  చాణక్య (34) ల సాయంతో ఈ నెల 6న చంపాలని నిర్ణయించుకున్నారు.   6న వరలక్ష్మి ఇంట్లో లేకపోవడంతో మరుసటి రోజు హత్య చేయాలని నిర్ణయించుకున్నారు.  7న ఉదయం 
వరలక్ష్మి మౌన వ్రతంలో ఉండడంతో ఇదే అదునుగా భావించి మొదట శశికళ ఇంట్లోకి వెళ్లి గొడవ పడింది. ఆమె వెంట వెళ్లిన తరుణ్ కుమార్, చాణక్య ఇద్దరూ  గొంతు నులిపి చంపేశారు. ఆమె వద్ద ఉన్న బంగారు నగలు, నగదు, ఏటీఎం కార్డు ను తీసుకొని వెళ్లిపోయారు.  వరలక్ష్మి కుమారుడి కంప్లైంట్​తో  దర్యాప్తు చేపట్టిన పోలీసులు  సీసీ పుటేజీల సాయంతో నిందితులను గుర్తించారు. ఈ కేసులో శశికళ మరో కుమారుడు సంతోష్​ కుమార్ కు విషయం తెలిసినా.. సాక్ష్యాలను తారుమారు చేయాలని చూడడంతో అతనిపై కూడా కేసు ఫైల్​చేసి నిందితులను రిమాండ్​కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. ఏఎస్పీ షాకిర్ హుస్సేన్, డీఎస్పీ ఆనంద్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.

కొల్లాపూర్​కు నిధులెందుకు తెస్తలేవ్​? : టీపీసీసీ మెంబర్​ అభిలాష్ రావు 

వీపనగండ్ల, వెలుగు: సీఎం కేసీఆర్​కు సన్నిహితుడినని చెప్పుకునే ఎమ్మెల్యే హర్షవర్ధన్​రెడ్డి నియోజవక వర్గానికి నిధులెందుకు తెస్తలేడో చెప్పాలని టీపీసీసీ మెంబర్​రంగినేని అభిలాష్​రావు ప్రశ్నించారు. హర్షవర్ధన్​రెడ్డికి   రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీయేనని, అది మరిచి ఆయన పార్టీని విమర్శించడం తగదన్నారు.  చిన్నంబావి మండల కేంద్రంలో ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  అభిలాష్ రావు మాట్లాడుతూ.. 40 రోజులుగా నియోజకవర్గానికి దూరంగా, ప్రగతి భవన్​లో ఉంటూ ఎన్ని ఫండ్స్​తెచ్చారో అందుకు సంబంధించిన జీవోలు విడుదల చేయాలని అన్నారు. కోర్టుల్లో  దోషులెవరో తేలకముందే ఎందుకు సంబరాలు చేస్తున్నారో కూడా ప్రజలకు వివరించాలన్నారు. కొల్లాపూర్ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. పలు పార్టీలు మారిన ఎమ్మెల్యే కాంగ్రెస్​నాయకులను  కొత్త బిచ్చగాళ్లు అని విమర్శించడం  గురిగింజ నీతిని గుర్తుచేసినట్లుందన్నారు.  

నిరుద్యోగ యువతకు రుణాలు

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పీఎంఈజీపీ పథకాన్ని వినియోగించుకోవాలని   ప్రాంతీయ అధికారి ఎస్ మంగా సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ లోని ఓ ప్రైవేట్​మీటింగ్ హాల్​లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కోసం నిరుద్యోగులు ఆన్ లైన్ ద్వారా  అప్లై చేసుకోవాలని తెలిపారు. 18 ఏండ్లు నిండిన వ్యక్తులు ఈ స్కీమ్​కు అర్హులని తెలిపారు. తయారీ రంగం పరిశ్రమలకు రూ.50 లక్షలు, సేవా రంగ పరిశ్రమలకు రూ.20 లక్షలు లోన్​ఇస్తారని, 25 నుంచి 35 శాతం వరకు సబ్సిడీ పొందవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత, స్వయం సహాయక బృందాలు వినియోగించుకోవచ్చన్నారు. 

బోయలను ఎస్టీల్లో చేర్చాలని  జలదీక్ష

గద్వాల, వెలుగు: ఎస్టీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ వాల్మీకి బోయలు చేస్తున్న దీక్ష 13వ రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించకపోవడంతో మంగళవారం వినూత్నరీతిలో జలదీక్ష చేశారు. జమ్ములమ్మ రిజర్వాయర్ లో మెడ వరకు నీళ్లలో మునిగి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. అనంతరం రిలే దీక్షల్లో  వాల్మీకి సంఘం లీడర్లు మాట్లాడుతూ.. గత కొన్నేండ్ల నుంచి వాల్మీకి బోయలను దొంగ హామీలతో ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయన్నారు. తమ ఓట్లతో గెలిచిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎమ్మెల్యేలు కూడా  తమ గురించి మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం తమ  డిమాండ్ పరిష్కరించాలని కోరారు.  కోటేశ్​, మధుసూదన్ బాబు, బలిగెర నారాయణరెడ్డి పాల్గొన్నారు.

‘ధరణి’ ని వెంటనే రద్దు చేయాలి : కాంగ్రెస్​నేత నాగం జనార్దన్ రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ధరణి  పోర్టల్​ను వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్​సీనియర్​నేత నాగం జనార్దన్ రెడ్డి డిమాండ్​చేశారు.  మంగళవారం నాగర్ కర్నూల్ లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.  ‘ధరణి’  వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పోడు భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.  ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు 10 వేల సూపర్ స్పెషాలిటీ బెడ్లను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారని, 8 ఏండ్ల పాలనలో ఎన్ని బెడ్లు తెచ్చారో  లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు.  టీఆర్ఎస్​, బీజేపీ లు  ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.  నియోజకవర్గంలో ప్రజాసమస్యలపై కార్యాచరణ రూపొందించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.  జడ్పీటీసీ రోహిణి, డీసీసీ ప్రధాన కార్యదర్శి అర్థం రవి, టి. పాండు, లక్ష్మయ్య పాల్గొన్నారు.  

అందరికీ ‘దళిత బంధు’ ఇవ్వాలె

అలంపూర్, వెలుగు: ఎస్సీలందరికీ ‘దళిత బంధు’ ఇవ్వాలని కేవీపీఎస్​జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు అన్నారు. మంగళవారం జిల్లా కమిటీ సమావేశం ఆలంపూర్ చౌరస్తా లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ ఈ నెల 28 న పూలే, డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలను అన్ని మండల కేంద్రాల్లో సక్సెస్​ చేయాలని    పిలుపునిచ్చారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతిజ్ఞలు, హాస్టళ్లలో సెమినార్లు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేవీపీఎస్​జిల్లా అధ్యక్షుడు గట్టు మారెన్న, రాష్ట్ర  కమిటీ మెంబర్​పరం జ్యోతి, జిల్లా కమిటీ సభ్యుడు విజయ్ కుమార్, ఆంజనేయులు పాల్గొన్నారు.