జహీరాబాద్, వెలుగు: జహీరాబాద్ మహీంద్ర అండ్ మహీంద్ర పరిశ్రమ దేశ చరిత్రలోనే మరో మైలురాయిని దాటిందని మహీంద్ర అండ్ మహీంద్ర ఆటోమోటివ్ పరిశ్రమ ప్రెసిడెంట్ రాజన్ వదేరా తెలిపారు. జహీరాబాద్ లోని పరిశ్రమ ఇప్పటి వరకు 10 లక్షల వాహనాలను తయారు చేసిన సందర్భంగా మంగళవారం పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 1985లో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆల్వీన్ నిస్సాన్ పరిశ్రమను ప్రారంభించారన్నారు. 1990లో మహీంద్ర సంస్థ ఆల్వీన్ నిస్సాన్ ను కొనుగోలు చేసి 1997లో ఆటో యూనిట్ప్రారంభించిం దన్నారు. 2001లో లగేజ్ ఆటోలు , 2003లో స్కూల్ బస్సులు, 2005లో అల్ఫా ఆటోతో లక్ష వాహనాలు ఉత్పత్తి చేశామన్నారు. 2015లో 5 లక్షల వాహనాలు తయారు చేసి పరిశ్రమను మరింత విస్తరించామన్నారు.
2019 సంవత్సరం నాటికి 10 లక్షల వాహనాలను జహీరాబాద్ యూనిట్ లో తయారు చేసి చరిత్ర సృష్టించామన్నారు. జహీరాబాద్ యూనిట్ లో తయారయ్యే జీతో వాహనాలు లక్ష పూర్తి చేసుకోవడం గొప్ప విషయమన్నారు. ఇందుకు కృషి చేసిన కార్మికులు, యాజమాన్యానికి, కార్మిక నాయకులకు ఆనంద్ మహీంద్ర, గోయంకాలుశుభాకాంక్షలు తెలిపారన్నారు. పది లక్షల మైలురాయిని దాటిన వాహనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్మికులు పరిశ్రమ ఆవరణలో ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు.
