హైదరాబాద్, వెలుగు: పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలకు డీసీసీ కార్యవర్గంలో పెద్దపీట వేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను, ఏఐసీసీ అబ్జర్వర్లను పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. బుధవారం ఈ ఇద్దరు నేతలు జూమ్ మీటింగ్ నిర్వహించి తెలంగాణలోని అన్ని జిల్లాల డీసీసీ చీఫ్లతో కార్యవర్గ నియామకాలపై పలు సూచనలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ నెల 25లోపు అన్ని డీసీసీ కార్యవర్గాలను నియమించి జాబితాను పీసీసీకి పంపించాలని ఆదేశించారు.
ఇక మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై దృష్టి పెట్టాలని, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను తీసుకోవాలని సూచించారు. పార్టీలో సిన్సియర్గా పనిచేస్తున్న కార్యకర్తలకు టికెట్లు కేటాయించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని డీసీసీ చీఫ్లను పీసీసీ అధ్యక్షుడు, పార్టీ ఇన్చార్జ్ కోరారు. ఇక జాతీయ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడంతో పాటు ఈ స్కీమ్ ను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్న కేంద్రం తీరును ఎండగట్టాలని కోరారు.
