అల్లరి చేస్తున్నారని స్టూడెంట్స్ను చితకబాదిన టీచర్

అల్లరి చేస్తున్నారని  స్టూడెంట్స్ను చితకబాదిన టీచర్
కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఓ ప్రైవేట్  స్కూల్​లో స్టూడెంట్స్​ను టీచర్​  చితకబాదిన ఘటన మంగళవారం జరిగింది. స్టూడెంట్ సాత్విక్, అతడి తల్లి సంజన తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వివేకానంద రోడ్​ కాలనీకి చెందిన సాత్విక్(11) పట్టణంలోని గౌతమ్​ హైస్కూల్​లో ఐదో తరగతి చదువుతున్నాడు. 
మధ్యాహ్నం  స్కూల్​ నుంచి ఇంటికి వచ్చిన సాత్విక్  క్లాస్ రూంలో ఇద్దరు స్టూడెంట్స్​ తనను సతాయిస్తున్నారని, స్కూల్​కు వెళ్లనని మారాం చేశాడు. దీంతో తల్లి సంజన కొడుకును తీసుకొని స్కూల్​కు వెళ్లి ప్రిన్సిపాల్​కు కంప్లైంట్​​చేసింది. ఆ తర్వాత స్టూడెంట్స్​ క్లాస్ రూంలో అల్లరి చేయడంతో ఓ టీచర్​ ముగ్గురు స్టూడెంట్స్​ను మందలించి కర్రతో చితకబాదింది. సాయంత్రం ఇంటికి వెళ్లిన సాత్విక్  తల్లికి ఈ విషయం చెప్పడంతో ఒంటి నిండా గాయాలు ఉండడంతో విస్తుపోయింది. వెంటనే స్కూల్​కు వెళ్లి ప్రిన్సిపాల్​ను నిలదీసింది. టీచర్​పై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సంజన తెలిపింది. టీచర్​పై చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్  తెలిపారు.