
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఎంఐఎం పార్టీని ఆదరిస్తారని చెప్పారు. మజ్లిస్ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచితీరుతుందని అసదుద్దీన్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో రాజస్థాన్లోనూ మజ్లిస్ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తెలంగాణ పదేండ్లుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని స్పష్టం చేశారు. మైనార్టీల అభివృద్ధి జరిగిందని వివరించారు.
హైదరాబాద్ అభివృద్ధి జరుగుతోందని, ఇక్కడి ప్రభుత్వానికి ముస్లింల మద్దతు ఉంటుందని తెలిపారు. మోదీ రాష్ట్రానికి వచ్చి కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ డబ్బులు ఇచ్చారని చెప్పారు. ఇది నిజమా అని ప్రశ్నించారు. ప్రధాని ఒక స్టాండ్తో మాట్లాడాలని, ఒక దగ్గర ఒక మాట ఇంకో దగ్గర ఇంకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు.
మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్కించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న 50శాతం రిజర్వేషన్ ను సడలించాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు.