ముంబై పోలీసులు బ్యాన్ చేసిన హుక్కా ఫ్లేవర్లపై గట్టి చర్యలు చేపట్టారు. దింతో ముంబై క్రైమ్ బ్రాంచ్ పక్కా సమాచారం ఆధారంగా ఒక గోడౌన్పై దాడి చేయగా... అక్కడ నికోటిన్ కలిసిన 1,831 బాక్సుల హుక్కా ఫ్లేవర్లను పట్టుకున్నారు. మహారాష్ట్రలో నికోటిన్ ఉన్న పొగాకు ఉత్పత్తులపై నిషేధం ఉన్నా ఇంకా అమ్మకాలు జరుగుతున్నాయని ఈ ఘటనతో బయటపడింది. పట్టుబడిన ఈ నికోటిన్ మొత్తం విలువ సుమారు రూ. 3 కోట్లకు పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో అక్రమ హుక్కా వ్యాపారంపై జరిగిన అతిపెద్ద దాడి ఇది.
ఇదిలా ఉండగా, మరో ప్రత్యేక ఆపరేషన్లో యాంటీ-నార్కోటిక్స్ సెల్ (ANC) పోలీసులు మాదకద్రవ్యాల (MD) అక్రమ రవాణాకు సంబంధించిన ఒక కేసులో ఒడిశాకు చెందిన పాత నేరస్థుడిని పట్టుకున్నారు. నిందితుడి పేరు అహ్మద్ మొహమ్మద్ షఫీ షేక్ (అలియాస్ అక్బర్ ఖౌ). ఇతను గతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో ఉన్నాడు.
అధికారుల ప్రకారం, ఘట్కోపర్ ANC యూనిట్ గతంలో NDPS చట్టం, 1985లోని సెక్షన్ 8(c), 22(3), 22(c), 29 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సుమారు రూ. 12.8 లక్షల విలువైన 64 గ్రాముల మెఫెడ్రోన్ను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఒక నిందితుడు ఫరీద్ రెహ్మతుల్లా షేక్ అలియాస్ ఫరీద్ చుహాను అరెస్టు చేయగా, స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను అక్బర్ ఖౌ సరఫరా చేసినట్లు తేలింది.
►ALSO READ | నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి.. దేశంలో పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టులో పిటిషన్
థానేలో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద గతంలో బెయిల్పై విడుదలైన అక్బర్ ఖౌ మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిఘా వర్గాల సమాచారం మేరకు ANC బృందం అతన్ని ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లా రాజ్గంగ్పూర్లో దాక్కున్నాడని గుర్తించి 1 నవంబర్ 2025న అతన్ని అరెస్టు చేసింది.
అతన్ని ముంబై సెషన్స్ కోర్టు ముందు హాజరుపరచగా.. కోర్టు అతనికి నవంబర్ 7 వరకు పోలీసు కస్టడీ విధించింది. ఇప్పటివరకు, ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు ఇంకా ఎంత పెద్ద నెట్వర్క్ ఉందో అని ANC దర్యాప్తు చేస్తోంది.
