- మైనర్టీ ఓటు బ్యాంక్ పై నజర్ ..
- ఓటర్లకు పలు హామీలిస్తున్న నేతలు
- సంక్షేమ పథకాలపై బీఆర్ఎస్ భారీగా ప్రచారం
- ఆరు గ్యారంటీ స్కీమ్లపై అవగాహన కల్పిస్తున్న కాంగ్రెస్
- ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్పుల పంపిణీ
హైదరాబాద్,వెలుగు : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మైనార్టీ ఓట్లపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతూ.. మైనార్టీలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రచారంలో నిమగ్నమయ్యాయి. తమకు ఓటు వేసేలా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముషీరాబాద్, సనత్నగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ వంటి స్థానాల్లో మైనార్టీ ఓటర్లుగా బాగానే ఉన్నారు. దీంతో గులాబీ పార్టీ నేతలు వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ముఖ్యంగా బీఆర్ఎస్ సంక్షేమ పథకాలైన డబుల్ బెడ్రూం, షాదీముబారక్, పింఛన్లతో ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తుంది. మళ్లీ ఎన్నికల్లో గెలిస్తే మరిన్ని కొత్త పథకాలు తీసుకొస్తామంటూ ఆకర్షిస్తున్నది. కాంగ్రెస్అభ్యర్థులను ప్రకటించకపోయినా.. ఆశావహ నేతలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ముషీరాబాద్లో మాజీ ఎంపీ, ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తానంటున్న ఎం. అంజన్కుమార్యాదవ్ నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ముస్లింలు, క్రిస్టియన్ల సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాలపై దృష్టిపెట్టారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్ లపై ప్రచారం చేసుకుంటున్నారు. ప్రతి ఇంటికి కార్యకర్తలు వెళ్లి ఓటర్స్లిప్పులు అందజేస్తున్నారు. అన్ని కుటుంబాల్లో అర్హులైన వారికి ఓటు ఉందా? లేదా? అనేది అడిగి తెలుసుకుంటున్నారు. కాంగ్రెస్అధికారంలోకి రాగానే ముస్లింలకు మరిన్ని పథకాలు అమలు చేస్తామంటూ హామీలిస్తున్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో మర్రి ఆదిత్యారెడ్డి, మరికొందరు ఎవరికి వారే తమకే టికెట్వస్తుందన్న ధీమాతో మైనార్టీలను ప్రసన్నం చేసుకుంటున్నారు.
మరిన్ని పథకాలు ఇప్పిస్తమంటూ..
బీఆర్ఎస్ సిట్టింగ్అభ్యర్థులు ఒకడుగు ముందుకేసి ప్రత్యేకంగా మైనార్టీలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలిపిస్తే అర్హులకు డబుల్బెడ్రూం, షాదీ ముబారక్, ఆసరా పింఛన్ల వంటివి ఎక్కువ మంజూరు చేయిస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. సనత్నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఆయా స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ఆశిస్తున్న వారు కూడా మైనార్టీలకు గాలం వేస్తున్నారు. ఆకట్టుకునేందుకు వారి ఇళ్లకు వెళ్లి పలకరించడం, ప్రార్థనా మందిరాల వద్దకు వెళ్లి కలుస్తున్నారు. ఓటరు లిస్ట్లో పేరు లేకపోయినా, ఇతర ఏ సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నారు. తమ పార్టీకే ఓటు వేయాలంటూ ఓటరు స్లిప్పులను కూడా పంపిణీ చేస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తే..
కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటా పోటీ ప్రచారంతో చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటిస్తే మాత్రం ఎన్నికల ప్రచారం మరింత జోరందుకోనుంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్, బీజేపీ తరఫున తమకు ఎలాంటి అభ్యర్థుల నుంచి గట్టిపోటీ ఎదురవుతుందోనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎదురుచూస్తున్నారు.