సభల జోరు.. ప్రచార హోరు .. బడా లీడర్ల సభలతో పార్టీ క్యాడర్​లో జోష్ 

సభల జోరు.. ప్రచార హోరు .. బడా లీడర్ల సభలతో పార్టీ క్యాడర్​లో జోష్ 
  • మెదక్, జహీరాబాద్  లోక్ సభ సెగ్మెంట్లలో ప్రచార జోరు  పెంచిన పార్టీలు
  • ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి, కేంద్ర హోం మంత్రి, రాష్ట్ర మంత్రుల ప్రచార సభలతో శ్రేణుల్లో ఉత్సాహం

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : పార్లమెంట్​ఎన్నికల నామినేషన్ల  ప్రక్రియ ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఉమ్మడి మెదక్​ జిల్లా పరిధిలో విస్తరించి ఉన్న  మెదక్, జహీరాబాద్​లోక్​సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్​ పార్టీలు మొన్నటి దాక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పార్టీ మీటింగ్​ లు నిర్వహించి లీడర్లు, క్యాడర్​ ను ఎన్నికలకు సన్నద్ధం చేశాయి. ఇప్పుడు ఎలక్షన్​సమీపిస్తుండడంతో ప్రచారంపై ఫోకస్​ పెట్టాయి. ఇందులో భాగంగా పోటా పోటీగా రోడ్​షోలు, కార్నర్​ మీటింగ్​లు, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు.

ఓ వైపు ఆయా పార్టీల అభ్యర్థులతో పాటు లోక్​ సభ నియోజకవర్గ ఇన్​చార్జిలుగా ఉన్న మంత్రులు, మాజీ మంత్రులు, రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులు, ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్​ చైర్మన్​లు, మాజీ చైర్మన్​లు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతేగాక ఓటర్లను ఆకట్టుకునేలా, వారి మద్దతు కూడగట్టుకోవడానికి బడా నేతల బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్​ మెదక్ లోక్​ సభ నియోజకవర్గ కేంద్రమైన మెదక్​ పట్టణంలో సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి రోడ్​ షో, కార్నర్​ మీటింగ్, జహీరాబాద్​ లోక్ సభ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద శంకరంపేటలో జన జాతర బహిరంగ సభ నిర్వహించింది.

ఆయా లోక్​సభ నియోజకవర్గాల కాంగ్రెస్​ ఎన్నికల ఇన్​చార్జిలు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. త్వరలో సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ప్రచార సభ నిర్వహించేందుకు కాంగ్రెస్​ప్లాన్​ చేస్తోంది. బీఆర్ఎస్​ ఇటు మెదక్, అటు జహీరాబాద్​ రెండు లోక్​ సభ నియోజకవర్గాలకు కలిపి ఆందోల్​ మండలం సుల్తాన్​పూర్​లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. దీనికి బీఆర్​ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​హాజరయ్యారు. నామినేషన్ల చివరి రోజు మెదక్ పట్టణంలో నిర్వహించిన రోడ్​ షో, కార్నర్​ మీటింగ్​లో  మాజీ మంత్రి హరీశ్​రావు​ పాల్గొన్నారు.

బీజేపీ మెదక్​లో గోవా సీఎం ప్రమోద్ సావంత్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ, ప్రచార సభ నిర్వహించగా, సిద్దిపేటలో ప్రచార సభకు కేంద్ర హోం మంత్రి అమిత్​షా హాజరయ్యారు. మెదక్, జహీరాబాద్​లోక్​సభ నియోజకవర్గాలకు కలిపి ఈనెల 30న మెదక్​ జిల్లా అల్లాదుర్గంలో నిర్వహించే ఎన్నికల ప్రచార బహిరంగ సభకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. రోడ్​ షోలు, కార్నర్​ మీటింగ్​లు, బహిరంగ సభలు మూడు ప్రధాన పార్టీల క్యాడర్​లో జోష్​ నింపుతున్నాయి. పోలింగ్​తేదీ సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.