న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అడుగడుగునా పశ్చిమ బెంగాల్ను అప్రతిష్టపాలు చేస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. విభజన రాజకీయాలకు బెంగాల్ ప్రజలు ఎన్నటికీ సరెండర్ కాబోరని అన్నారు. టీఎంసీ రక్తపాతం సృష్టించిందంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మమత ఆదివారం స్పందించారు ‘‘రాష్ట్రంలోని బీజేపీ నాయకులను సంతోషపెట్టడానికి బెంగాల్ను ప్రధాని అవమానించారు, అణచివేశారు, బాధించారు. మోదీ విదేశాలకు వెళ్తున్నారు.. ఒప్పందాలు చేసుకుంటున్నారు.. బహుమతులు ఇస్తున్నారు.. సర్టిఫికెట్లతో తిరిగి వస్తున్నారు” అని విమర్శించారు. ‘‘100 రోజులుగా మణిపూర్ మంటల్లో చిక్కుకున్నది.
మణిపూర్లాంటి చిన్న రాష్ట్రంలోనే శాంతి భద్రతలను ప్రధాని కంట్రోల్ చేయలేకపోతే.. మొత్తం దేశాన్ని ఎలా నడుపగలరు? బెంగాల్ను అడుగడుగునా అప్రతిష్టపాలు చేస్తూ, బెదిరిస్తూ ఎలా దేశాన్ని నడుపుతారు?” అని నిలదీశారు. ‘‘ప్రజలకు మనవతా సందేశాన్ని ఇవ్వాల్సిన ప్రధాని.. అందుకు బదులుగా ఓ చిన్న కార్యక్రమంలో బెంగాల్ను అప్రతిష్టపాలు చేసేందుకు ఎంచుకున్నారు. బెంగాల్ను గుర్తు చేసుకున్నందుకు వ్యక్తికి కాకుండా ప్రధాని కుర్చీకి థ్యాంక్స్ చెబుతున్నాను” అని మమతా బెనర్జీ ఆరోపించారు.