సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బిగ్ షాకిచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని, ఇండియా కూటమితో పొత్తు ఉండదని ప్రకటించారు. కూటమిలోని కాంగ్రెస్తో సీట్ల పంపకాల చర్చలు విఫలమయ్యాయని ఆమె తెలిపారు. బెంగాల్ లో ఒంటరిగానే పోటీ చేసి బీజేపీని తాము ఓడించగలమని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర తమ రాష్ట్రం నుంచి వెళ్లాల్సి ఉన్నా తమకు సమాచారం ఇవ్వలేదని మమతా బెనర్జీ అన్నారు.
పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 లోక్సభ స్థానాలన్నాయి. అయితే సీట్ల పంపకాల్లో రెండు స్థానాలు కాంగ్రెస్ కు ఇవ్వాలని టీఎంసీ భావించగా.. కాంగ్రెస్ మాత్రం 10 నుంచి 12 సీట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో ఒంటరిగానే పోటీ చేయాలని టీఎంసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కాగా లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ఇండియా కూటమిలో మమతా బెనర్జీ కీ రోల్ పోషిస్తూ వచ్చారు.