కుక్కను చంపి జైలుపాలయిన వ్యక్తి

కుక్కను చంపి జైలుపాలయిన వ్యక్తి

విచక్షణా రహితంగా వీధి కుక్కను కొట్టి చంపి జైలు పాలయ్యాడో వ్యక్తి. ఈ ఘటన ఢిల్లీలోని ముకుందాపూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ముకుందాపూర్ లోని  ఫౌజి కాలనీకి చెందిన రాజ్‌ కుమార్‌ అనే వ్యక్తి భార్యాపిల్లలతో నివసిస్తున్నాడు.  అయితే గురువారం (మే 23) రాత్రి కుమార్‌ భార్య ఎప్పటిలాగే తన పెంపుడు కుక్కను తీసుకొని వాకింగ్‌కు వెళ్లింది. అక్కడ వీధిలో ఉన్న ఓ కుక్క ఈ పెంపుడు కుక్కను చూసి మొరుగుతూ.. దాడి చేయబోయింది. దానిని అడ్డుకునేందుకు కుమార్‌ భార్య వీధి కుక్కను అక్కడే ఉన్న రాళ్లతో కొట్టింది.

దీంతో ఆ కుక్క ఆమెపై దాడి చేసి పలు చోట్ల కరిచింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. కుక్క చేసిన గాయాలతో ఇంటికి వచ్చిన కుమార్‌ భార్య.. జరిగిన విషయం భర్తకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడైన కుమార్‌ ఓ కర్ర తీసుకొని వీధిలోకి వెళ్లాడు. కుక్కను గుర్తించి దారుణంగా కొట్టాడు.

అక్కడున్న వారంతా అలా కొట్టొద్దని వారించినా వినకుండా కర్రతో బలంగా కుక్కపై దాడి చేశాడు. దీంతో కుక్క అక్కడికక్కడే చనిపోయింది. ఇదంతా అక్కడ ఉన్న స్థానికురాలు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుక్కను చంపొద్దని కోరిన వినకుండా దారుణంగా కొట్టాడని, మొదటి అతని భార్యనే కుక్కను రాళ్లతో కొట్టారని తెలిపింది. అతను ఇంతకు ముందు కూడా మరో రెండు కుక్కులను చంపాడని ఫిర్యాదులో పేర్కొంది.