హైదరాబాద్ పాత బస్తీలో కాల్పుల కలకలం.. నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్  పాత బస్తీలో కాల్పుల కలకలం.. నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్ లోని  ఓల్డ్ సిటీలో పాత కక్షలు భగ్గుమన్నాయి. మంగళవారం అర్థరాత్రి ఓ వ్యక్తిపై ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కత్తులు, తుపాకులతో ఆకాశ్ సింగ్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. టపాచబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్వాన్ మురిగి చౌక్ దగ్గర ఈ ఘటన జరిగింది. హత్య అనంతరం నిందితులిద్దరూ పోలీసుల ముందు లొంగిపోయారు.

సౌత్ వెస్ట్ జోన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఆకాశ్ సింగ్ కు క్రాంతి కుమార్ కు మధ్య కొంత కాలంగా విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నెలల క్రితం క్రాంతిపై ఆకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేశారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన నిందితుడు ఎలాగైనా ఆకాశ్ ను అంతమొందించాలని కక్ష కట్టాడు. పక్కా పథకం ప్రకారమే బిహార్ నుంచి రెండు నెలల కిందట తుపాకీని కొని తెచ్చుకున్నాడు. ఈ దారుణానికి తన స్నేహితుడు చంద్ర జోషి సాయం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి మంగళవారం అర్థరాత్రి ఆకాశ్ ను కిరాతకంగా హత్య చేశారు. గాల్లో రెండు రౌండ్లు కాల్పులు జరిపి పోలీసుల ఎదుట లొంగిపోయారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చరీకి తరలించారు.  అక్కడి నుంచి కత్తులు, హత్యకు ఉపయోగించిన తుపాకీని వారు  స్వాధీనం చేసుకున్నారు. గతంలో ప్రధాన నిందితుడైన క్రాంతి కుమార్ పై 307 కింద కేసు నమోదైందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టుగా డీసీపీ కిరణ్ వెల్లడించారు.