హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది.. ఓ వ్యక్తిని నడిరోడ్డుపైనే కత్తులతో పొడిచి చంపేశారు. గురువారం ( డిసెంబర్ 4 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. పాతబస్తీలోని రెయిన్ బజార్ చోటా పూల్ దగ్గర దారుణ హత్య జరిగింది. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో వివాదం కారణంగా జునైద్ బీ మహమ్మద్ అనే వ్యక్తిని నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు. సమీప బంధువులే ఈ హత్య చేశారని చెబితున్నారు పోలీసులు.
హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా.. చదువుకోమని కుటుంబ సభ్యులు మందలించడంతో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్కు చెందిన ఓం ప్రకాశ్ బిశ్నాయి జీవనోపాధికోసం నగరానికి వచ్చి జీడిమెట్ల భాగ్యలక్ష్మీ కాలనీలో ఉంటూ మార్బుల్ వ్యాపారం చేస్తున్నాడు.
ఇతని కొడుకు రాజకుమార్ బిశ్నాయి(14) చింతల్ గాంధీనగర్లోని ఓ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం రాజ్కుమార్ను చదువుకోమని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయాడు. పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
