ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని ఢీకొట్టిన కారు యజమాని 10 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడు. తెల్లవారు జామున 4గంటల ప్రాంతంలో ఢిల్లీకి చెందిన వీరేంద్ర సింగ్ అనే వ్యక్తి.. ఆగ్రా నుంచి నోయిడాకు కారులో వెళ్తున్నాడు. ఆ సమయంలో ఓ వ్యక్తిని ఢీ కొట్టి.. దాదాపు పది కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. మథుర ఎక్స్ప్రెస్ వే టోల్ బూత్ సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే.. దట్టమైన పొగమంచు కారణంగా తనకేమీ కనిపించలేదని కారు కింద ఓ వ్యక్తి ఇరుక్కున్నట్లు తెలియలేదని చెప్పాడు.
ఈ ప్రమాదంలో కారు కింద ఇరుక్కున్న వ్యక్తి మృతదేహం గుర్తుపట్టలేని విధంగా నుజ్జునుజ్జైంది. ఆ వ్యక్తి ఎవరన్నది పోలీసులు ఆరా తీస్తున్నారు. సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అతడిని గుర్తించే పనిలో ఉన్నారు.