మ్యాజిక్ అద్దం అని చెప్పి.. వెయ్యి రూపాయల అద్దాన్ని.. రూ.9 లక్షలకు అమ్మాడు

మ్యాజిక్ అద్దం అని చెప్పి.. వెయ్యి రూపాయల అద్దాన్ని.. రూ.9 లక్షలకు అమ్మాడు

చెప్పేవాడికి బుద్ధి లేకపోయినా వినేవాడికైనా ఉండాలి కదా ఇది మనం తరచూ వినే సామెత. ఎదుటి వారు చెప్పే విషయాలు ఎంతవరకు వాస్తవమో .. అవి అసలు నిజాలేనా అని ఓ అంచనాకు రాకుండా గుడ్డిగా నమ్మితే ..  అది మొదటికే మోసానికి వస్తుంది అనడానికి ప్రత్యక్ష ఉదాహరణనే ఈ ఘటన. అద్దంలో మనుషులను నగ్నంగా చూడొచ్చని ఓ వ్యక్తిని బురిడి కొట్టించారు ముగ్గురు  దుండగులు. సినిమాలో మాదిరిగా మ్యాజిక్ అద్దం పేరుతో ఏకంగా 9 లక్షల రూపాయిలకు  టోకరా పెట్టారు. అలస్యంగా నిజం తెలుసుకున్న బాధితుడు నెత్తినోరు బాదుకున్నాడు. ఏం లాభం పాపం చేసేదేమీ లేక  పోలీసులను ఆశ్రయించాడు.

తెలుగులో ఈ మధ్య బింభిసార అనే సినిమా వచ్చింది. అందులో ఓ మాయా అద్దం(magic mirror) ఉంటుంది. దాని ద్వారా టైమ్ ట్రావెల్ చేయచ్చని చిత్రంలో చూపించారు. అలాగే ఒక వ్యక్తిని అద్దంలో మనుషులను నగ్నంగా చూడొచ్చని నమ్మించి మోసం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో చోటుచేసుకుంది. అదే రాష్ట్రానికి చెందిన అవినాశ్‌ కుమార్‌ (72)  మాయా అద్దం పేరుతో ఆశపడి ఘరానా మోసగాళ్లకు అడిగినంత డబ్బు ఇచ్చాడు. తీరా ఇంటికి వచ్చి చూస్తే అది మాములు మిర్రర్ అని తెలిసి తెల్లబోయాడు. ఆలస్యం చేయకుండా వెంటనే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అవినాశ్‌ కుమార్‌ వద్దకు పార్థ సింగ్రే, మొలయా సర్కార్‌, సుదీప్తా సిన్హారాయ్‌లు అనే ముగ్గురు వ్యక్తులు వచ్చారు. తామంతా పురాతన వస్తువులను భద్రపరిచే ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నారు. అయితే తమ వద్ద ఓ మ్యాజిక్‌ అద్దం(magic mirror) ఉందని, దానితో మనుషులను నగ్నంగా చూడొచ్చని, భవిష్యత్తును కూడా అంచనా వేయవచ్చని మాయమాటలు చెప్పి నమ్మించారు. అయితే దాని విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. కానీ వారి డబ్బు అత్యవసరం కాబట్టి అంత విలువైన మాయా అద్దాన్ని కేవలం రూ.9 లక్షలకే అమ్ముతామని ఆశ చూపారు. మొదట వారి మాటాలను అనుమానించిన అవినాశ్‌ కుమార్‌ సందేహం వ్యక్తం చేశాడు. దీంతో నిందితులు.. అనేక అబద్దాలు నిజమే అన్నట్లుగా నమ్మించారు.

 నాసా(NASA) శాస్త్రవేత్తలు సహా అనేక మంది దీన్ని ఉపయోగించారంటూ నమ్మకం కలిగించారు. ఆశ కలిగిన వృద్దుడు డబ్బు ఏర్పాటు చేసుకొని వారిని సంప్రదించగా, ఒడిశా(Odisha) రాజధాని భువనేశ్వర్‌‌కు(Bhubaneswar) రమ్మన్నారు. వెంటనే వారు అడిగిన రూ.9 లక్షలను చెల్లించి మిర్రర్ తెచ్చకున్నాడు. ఇంటికొచ్చి అన్ని రకాలుగా ట్రై చేసిన వృద్దుడు తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులను సంప్రదించి జరిగిన విషయం అధికారులకు తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పశ్చిమబెంగాల్‌లో అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. ఇలాగే వీరు  కేవలం తొమ్మిది రోజుల్లో 1200 మందిని మోసం చేసి  14 వందల కోట్ల రూపాయిలు స్వాహా చేసినట్లు తెలుసుకున్నారు. నిందితుల  నుంచి 5 మొబైల్ ఫోన్లు, కారు, 28 వేల రూపాయిలు  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కోరికలు ఉండటం సహజం. కానీ అవి హద్దుల్లో ఉంటే అందరికీ శ్రేయస్కరం. అవి కాస్త లిమిట్స్ దాటి మనిషిని డామినేట్‌ చేస్తే.. జీవితం చిక్కుల్లో పడటం ఖాయం. కొంతమందికి పిచ్చి పిచ్చి కోరికలు, ఫాంటసీలు ఉంటాయి. వాటిని తీర్చుకునే క్రమంలో విచక్షణ కోల్పోతూ ఉంటారు. చివరకు తమ పిచ్చి ఫాంటసీల కారణంగా ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు.