20 మంది పిల్లల కిడ్నాప్.. కాల్పుల్లో నిందితుడి మృతి

20 మంది పిల్లల కిడ్నాప్.. కాల్పుల్లో నిందితుడి మృతి
  • ఆడిషన్స్ పేరుతో పిలిచి బంధించిన రోహిత్ ఆర్యా
  • పిల్లల్ని సురక్షితంగా విడిపించిన పోలీసులు

ముంబై: మహారాష్ట్ర ముంబైలోని పొవాయి ఏరియాలో ఒక వ్యక్తి 20 మంది పిల్లల్ని బంధించి తీవ్ర భయాందోళనలు కలిగించాడు. కొందరి నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్లు పెట్టాడు. రెస్క్యూ ఆపరేషన్​చేపట్టిన పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు విచారణలో తేలింది. 

రోహిత్ ఆర్యా అనే వ్యక్తి ఆర్‌ఏ యాక్టింగ్ స్టూడియోలో మూడు, నాలుగు రోజులుగా ఆడిషన్లు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా గురువారం కూడా 10 నుంచి 14 ఏండ్ల వయస్సు ఉన్న దాదాపు 80 నుంచి 90 పిల్లలు ఆడిషన్లకు హాజరయ్యారు. మధ్యాహ్నం వరకు ఆడిషన్స్ నిర్వహించిన రోహిత్ ఆర్యా 20 మంది పిల్లల్ని గదిలో బంధించాడు. కొన్ని విచిత్రమైన డిమాండ్లతో ఒక వీడియో రీలిజ్ చేశాడు. 

‘‘నేను 20 మంది పిల్లల్ని బంధిస్తున్నాను. నేను టెర్రరిస్టును కాదు. నన్న షూట్ చేయకండి. నాకు డబ్బులు అవసరం లేదు. నావి సింపుల్ డిమాండ్స్. నేను కొద్ది మందితో మాట్లాడాలి. నేను వారి నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్న. నాకు ఈ అవకాశం కల్పించకుంటే పిల్లల్ని చంపేసి.. ఆత్మహత్య చేసుకుంటాను” అని అందులో పేర్కొన్నాడు.  అతను పేర్కొన్న పేర్లలో మాజీ మంత్రి దీపక్ కేసర్కర్‌ కూడా ఉన్నాడు.

మూడు గంట్లలో రెస్క్యూ పూర్తి 

బంధించడంతో తీవ్రంగా భయపడిన పిల్లలు.. తమను రక్షించాలని కీటికీల నుంచి కేకలు వేశారు. దీంతో ఆ బిల్డింగ్​ వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రోహిత్​తో మాట్లాడే ప్రయత్నం చేశారు. అందుకు అతను అంగీకరించకుండా ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడు. రెస్క్యూ ఆపరేషన్ ​చేపట్టిన పోలీసులు బాత్‌రూమ్ గుండా బిల్డింగ్ లోపలికి ప్రవేశించారు.

 మరోవైపు ఫైర్ బ్రిగేడ్ సాయంతో కిటీకీలు, డోర్ల గ్రిల్స్ కట్ చేశారు. మొత్తం మూడు గంటల్లో రెస్క్యూ ఆపరేషన్​ పూర్తి చేశారు. పిల్లలు అందరినీ సురక్షితంగా కాపాడారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రోహిత్‌ షూట్​ చేయడంతో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో అతనికి బుల్లెట్లు తగిలాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు.