
బదౌన్: రూ.200 కోసం ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్, బదౌన్ జిల్లా ఉషాయిత్ ఏరియాలోని లీలా నగ్ల గ్రామంలో జరిగింది లీలా నగ్లీ గ్రామానికి చెందిన మిథున్ అనే యువకుడు అదే గ్రామంలో ఓ ఇంట్లో కూలీ పనికి వెళ్లాడు. పని ముగిసిన అనంతరం మిథున్ రూ.200 కూలీ డబ్బులు అడిగాడు.
అయితే, రూ.200 చాలా ఎక్కువని మిథున్తో పని చేయించుకున్న సురేష్, సుబేష్ గొడవకు దిగారు. దీంతో స్థానికులు కలుగజేసుకుని సర్దిచెప్పారు. అయితే రాత్రి సమయంలో సురేష్, సుబేష్ ఇద్దరూ మిథున్ ఇంటికి వెళ్లారు. మిథున్ సోదరుడు విక్రమ్ (28) బయటకు రాగానే తుపాకీతో కాల్చి పారిపోయారు. కుటుంబసభ్యులు వెంటనే విక్రమ్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు డాక్టర్లు. బాధిత కుటుంబం నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.