
బషీర్బాగ్, వెలుగు: ఓ డేటింగ్ యాప్ ద్వారా మహిళ పేరుతో చాటింగ్ చేసిన స్కామర్స్.. ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయించి మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. బేగంపేటకు చెందిన 41 ఏళ్ల వ్యక్తిని స్కామర్స్ హప్పెన్ డేటింగ్ యాప్ ద్వారా చాందిని చౌదరి అనే మహిళ పేరుతో పరిచయం చేసుకున్నారు. వాట్సాప్ లో చాటింగ్ చేశారు. ఆప్టినెక్స్ మార్కెట్స్ సంస్థలో ట్రేడింగ్ విశ్లేషణ , సలహాలు ఇస్తున్నట్లు తెలిపారు. https://pc.optinexmarkets.cc వెబ్ సైట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. మొదట రూ.50 వేలు ఇన్వెస్ట్ చేయగా కొంత లాభం ఇచ్చారు.
నమ్మకం కలగడంతో రూ.8 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. లాభాలు చూపించినా విత్డ్రా చేసుకునేందుకు అనుమతించలేదు. మరింత ఇన్వెస్ట్ చేస్తే మొత్తం డబ్బులు చెల్లిస్తామని చెప్పడంతో మరోసారి రూ.5 లక్షల 31 వేలు ఇన్వెస్ట్ చేశాడు. ట్యాక్స్ల పేరుతో మరిన్ని డబ్బులు అడిగడంతో బాధితుడు స్కాం అని గ్రహించాడు. అప్పటికే ఆయన రూ.13 లక్షల 31 వేలు పోగొట్టుకున్నాడు.