న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ గెలిచి జోరుమీదున్న టీమిండియా ఇప్పుడు భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి సారించబోతున్నది. ఈ నేపథ్యంలో జట్టులో అత్యంత కీలకమైన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్ లోడ్పై ప్లానింగ్ మొదలుపెట్టనుంది. 2027 వన్డే వరల్డ్ కప్ దృష్ట్యా బుమ్రాను ఫిట్గా ఉంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు మేనేజ్మెంట్ సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో టీ20లను తగ్గించి ఎక్కువగా వన్డేలు ఆడించేలా ప్లాన్స్ రెడీ చేస్తోంది. రాబోయే 18 నెలల కాలంలో టీ20 సిరీస్లకు బదులుగా ఎక్కువ వన్డేలకు బుమ్రాను అందుబాటులో ఉంచాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. బైలేటర్ సిరీస్లు, జపాన్లో జరిగే ఆసియా క్రీడలు ఉన్నా.. వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు లేవు.
ఇక చాలామంది సీనియర్ ప్లేయర్లు కోరుకుంటున్నట్లుగా బుమ్రా కూడా 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్లో ఆడాలని ఆసక్తిగా ఉన్నాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అయితే 2027 వరల్డ్ కప్ వరకు వైట్బాల్ ఫార్మాట్పైనే ఎక్కువగా దృష్టిపెట్టి ఆ తర్వాత మళ్లీ షార్ట్ ఫార్మాట్లో బరిలోకి దిగేలా బుమ్రా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు.
ఐపీఎల్ తర్వాతే..
ఈ నెల 28 నుంచి మొదలయ్యే ఐపీఎల్ దాదాపు రెండు నెలల పాటు సాగుతుంది. ఇందులో ముంబై ఇండియన్స్ తరఫున బుమ్రా బరిలోకి దిగనున్నాడు. ఇది పూర్తి కాగానే ఇండియా వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ను మొదలుపెట్టనుంది. నేషనల్ సెలెక్షన్ కమిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్తో కూడిన బృందం.. వన్డే వరల్డ్ కప్కు సంబంధించిన జట్టు, బుమ్రా వర్క్లోడ్, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో బ్లూ ప్రింట్ను సిద్ధం చేయనుంది.
ఇందులో అత్యంత కీలకంగా బుమ్రా వర్క్లోడ్పైనే ఎక్కువగా చర్చ జరగనుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)తో పాటు ఇతర బైలేటరల్ సిరీస్లు కూడా ఉన్న నేపథ్యంలో బుమ్రాను ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.
కొంతవరకు 2023–2026 మధ్య కాలంలో తీసుకున్న నిర్ణయాల మాదిరిగానే ఇప్పుడు కూడా వ్యవహరించే చాన్స్ ఉంది. 2023 వరల్డ్ కప్ ఫైనల్ ముగిసిన తర్వాత బుమ్రా 42 మ్యాచ్లు ఆడాడు. ఇందులో 21 టెస్ట్లు, 21 టీ20లు ఉన్నాయి. ఒక్క వన్డే కూడా ఆడలేదు.
అంటే టీ20 వరల్డ్ కప్ దృష్ట్యా అప్పట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా వన్డే వరల్డ్ కప్ కీలకం కావడంతో బుమ్రాపై వర్క్లోడ్ను తగ్గించి అతన్ని పూర్తి ఫిట్నెస్తో ఉంచాలని భావిస్తున్నారు. ‘మెగా టోర్నీల్లో బుమ్రా ఫిట్నెస్ చాలా కీలకం. కాబట్టి టీమ్ మేనేజ్మెంట్ ఫార్మాట్లకు అనుగుణంగా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. టెస్ట్ క్రికెట్ ఎలాగూ ఆడతాడు.
కాబట్టి వన్డే వరల్డ్ కప్ సైకిల్ దృష్ట్యా ఎక్కువగా ఈ ఫార్మాట్పై దృష్టిసారించాలి. 30, 35 మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది. కాబట్టి ఎలాంటి అవకాశాన్ని వదులుకోవద్దు’ అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. వన్డేల్లో ఇండియా పేస్ బౌలింగ్ పూల్ అనుకున్నంత పెద్దగా లేదు. కోర్ గ్రూప్లో బుమ్రా, సిరాజ్, అర్ష్దీప్ సింగ్, హర్షిత్ రాణా (ఫిట్నెస్తో ఉంటే) ఉన్నారు. వీళ్లకు తోడు మరికొంత మందిని తయారు చేసుకోవాలి. కాబట్టి బలగాన్ని పెంచుకుంటే కోర్ గ్రూప్ బౌలర్లపై పెద్దగా వర్క్లోడ్ పడకుండా చూసుకోవచ్చు.
