హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి మేనేజ్మెంట్ కోటా అమలు కానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఉన్నత విద్యామండలి తాజాగా ప్రభుత్వానికి పంపించింది. రాష్ట్రంలో మొత్తం 955 డిగ్రీ కాలేజీలుంటే, వీటిలో 3.66 లక్షలకు పైగా సీట్లున్నాయి. వాటిలో 804 ప్రైవేటు డిగ్రీ కాలేజీలు దోస్త్ పరిధిలో కొనసాగుతున్నాయి. అయితే సీట్లన్నింటినీ ప్రభుత్వమే డిగ్రీ ఆన్లైన్ సర్వీస్తెలంగాణ (దోస్త్) ద్వారా భర్తీ చేస్తోంది. దీంతో కొన్నేండ్లుగా మేనేజ్మెంట్ కోటాను ప్రవేశపెట్టాలని ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో 2020–21 విద్యాసంవత్సరానికి అన్ని కాలేజీల్లో 30శాతం సీట్లను మేనేజ్మెంట్, 70 శాతం కన్వీనర్ కోటాలో సీట్లను భర్తీ చేసుకునేలా అవకాశమివ్వాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. అయితే మేనేజ్మెంట్ కోటా ఇవ్వడం వల్ల సర్కారు వచ్చే నష్టమేమీ ఉండదు కాబట్టి, ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు అంగీకరించే చాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఒకేసారి 30 శాతం మేనేజ్మెంట్ కోటా అమలు చేస్తుందా లేక, కొంతశాతం తగ్గిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.