పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ. మాదిగల అండదండలతో గెలిచిన రేవంత్ తమను అవమాన పరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ పై రేవంత్ రెడ్డిని నమ్మేదెలా అని ప్రశ్నించారు. గాంధీ భవన్ లో వినతి పత్రం ఇస్తే ఇంత వరకు ఎలాంటి హామీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే రేవంత్ ఏ పార్టీలో ఉంటాడో తెల్వదన్నారు. ఆయన ఒంటిమీద అన్ని పార్టీల జెండాలు మారాయన్నారు. రేవంత్ మాటలకు విలువ లేదన్నారు.
తన ఎదుగుదల కోసం రేవంత్ రెడ్డి ఏంతకైనా తెగిస్తారని.. ఆయన కన్నా పిట్టల దొర బెటరన్నారు మంద కృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ చేత లెటర్ రాయమని అడిగితే ఇంతవరకు సమాధానం లేదని మండిపడ్డారు. ఎంపీగా బయట వేదికలపై మాట్లాడిన రేవంత్.. పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. రెండు నిముషాలు మాట్లాడే ఓపిక లేని రేవంత్ తమను ప్రశ్నిస్తారంటూ మండిపడ్డారు.
కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు మందకృష్ణ మాదిగ. తమకు మానవత్వం ఉంటే రేవంత్ కు కులతత్వం ఉందన్నారు. ఎంతో మంది రెడ్డీలను చూశా కానీ రేవంత్ లాంటి వ్యక్తులను చూడలేదన్నారు. రెడ్డీల చేతుల్లోనే అధికారం, భూములు ఉండాలని వ్యాఖ్యానించడం ఆయన కులతత్వానికి నిదర్శనమన్నారు.
ఎస్సీ వర్గీకరణకు ఎవరు మద్దతిస్తే వారికే అండగా నిలుస్తామన్నారు మందకృష్ణ మాదిగ. ఎమ్మార్పీఎస్ చేసిన ఉద్యమాలలో కిషన్ రెడ్డి భాగస్వామి అని.. ఆయన వల్ల తమకు మేలు జరిగిందన్నారు. రేవంత్ వల్ల సమాజానికి ఒరిగిందేంటని ప్రశ్నించారు.