
భద్రాచలం, వెలుగు: మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్ కుంజాం హిడ్మా అలియాస్ మోహన్ను గురువారం ఒడిశాలోని కోరాపూట్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై రూ.4 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలోని ఊసూరు బ్లాక్ జనగూడ గ్రామానికి చెందిన కుంజాం హిడ్మా ఒడిశాలోని కోరాపూట్, మల్కన్గిరి జిల్లాల్లో అనేక దాడుల్లో సూత్రధారి. జైపూర్ డీఎస్పీ పార్థ్కశ్యప్ కథనం ప్రకారం.. కోరాపూట్ జిల్లాలోని బోయ్పారిగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని పెట్గూడ గ్రామ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారు. పక్కా సమాచారంతో జిల్లా పోలీసులతో పాటు డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ జవాన్ల సాయంతో బుధవారం రాత్రి బలగాలు కూంబింగ్కు వెళ్లాయి. మావోయిస్టుల సమావేశం జరుగుతున్న ప్రాంతాన్ని భద్రతాబలగాలు గురువారం ఉదయం చుట్టుముట్టాయి.
ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ పారిపోగా, కుంజాం హిడ్మా భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. అతని నుంచి ఏకే-47 తుపాకీతో పాటు 35 రౌండ్ల తూటాలు, 27 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు, 90 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 2 కిలోల గన్ పౌడర్, విప్లవ సాహిత్యం తదితర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కోరాపూట్లో 4, మల్కన్గిరి జిల్లాలో మూడు కేసులు ఇతనిపై ఉన్నాయని వివరించారు. 14 ఏళ్ల వయసులో బాల మావోయిస్టుగా రంగ ప్రవేశం చేసి ఛత్తీస్గఢ్, ఒడిశాలో దళంలో పని చేశాడు. ప్రస్తుతం ఏవోబీలో సబ్ జోనల్ కమిటీ మెంబర్ సురేశ్దళంలో బోయ్పరిగూడ(ఒడిశా),పెదబల్లు(అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఏపీ) ఏరియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.