మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్​ హిడ్మా అరెస్ట్

మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్​ హిడ్మా అరెస్ట్

భద్రాచలం, వెలుగు: మావోయిస్టు ఏరియా కమిటీ మెంబర్​ కుంజాం హిడ్మా అలియాస్​ మోహన్​ను గురువారం ఒడిశాలోని కోరాపూట్​ జిల్లా పోలీసులు అరెస్ట్  చేశారు. ఇతనిపై రూ.4 లక్షల రివార్డు ఉంది. ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లాలోని ఊసూరు బ్లాక్​ జనగూడ గ్రామానికి చెందిన కుంజాం హిడ్మా ఒడిశాలోని కోరాపూట్, మల్కన్​గిరి జిల్లాల్లో అనేక దాడుల్లో సూత్రధారి. జైపూర్​​ డీఎస్పీ పార్థ్​కశ్యప్​ కథనం ప్రకారం.. కోరాపూట్​ జిల్లాలోని బోయ్పారిగూడ పోలీస్​స్టేషన్  పరిధిలోని పెట్గూడ గ్రామ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అయ్యారు. పక్కా సమాచారంతో జిల్లా పోలీసులతో పాటు డిస్ట్రిక్ట్  వాలంటరీ ఫోర్స్  జవాన్ల సాయంతో బుధవారం రాత్రి బలగాలు కూంబింగ్​కు వెళ్లాయి. మావోయిస్టుల సమావేశం జరుగుతున్న ప్రాంతాన్ని భద్రతాబలగాలు గురువారం ఉదయం చుట్టుముట్టాయి.

ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. మావోయిస్టులు కాల్పులు జరుపుకుంటూ పారిపోగా, కుంజాం హిడ్మా భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. అతని నుంచి ఏకే-47 తుపాకీతో పాటు 35 రౌండ్ల తూటాలు, 27 ఎలక్ట్రికల్​ డిటోనేటర్లు, 90 నాన్​ ఎలక్ట్రిక్​ డిటోనేటర్లు, 2 కిలోల గన్​ పౌడర్, విప్లవ సాహిత్యం తదితర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కోరాపూట్​లో 4, మల్కన్​గిరి జిల్లాలో మూడు కేసులు ఇతనిపై ఉన్నాయని వివరించారు. 14 ఏళ్ల వయసులో బాల మావోయిస్టుగా రంగ ప్రవేశం చేసి ఛత్తీస్​గఢ్​, ఒడిశాలో దళంలో పని చేశాడు. ప్రస్తుతం ఏవోబీలో సబ్​ జోనల్​ కమిటీ మెంబర్​ సురేశ్​​దళంలో బోయ్పరిగూడ(ఒడిశా),పెదబల్లు(అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఏపీ) ఏరియాలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.