- వైద్యం కోసం వెళ్లిన 13 మందిని ఏపీ పోలీసులు పట్టుకొని కాల్చి చంపారు
- మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరిట లేఖ
- హిడ్మా ఎన్కౌంటర్తో దేవ్జీకి ఎలాంటి సంబంధం లేదు!
- దేవ్జీ పోలీసుల అదుపులో లేడని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: హిడ్మా ది ఎన్కౌంటర్ కాదని, వైద్యం కోసం వెళ్లిన అతడిని ఏపీ పోలీసులు పట్టుకొని కాల్చి చంపారని, అది ముమ్మాటికీ హత్యేనని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది. ఇందుకు కేంద్ర హోంమంత్రి అమిత్షానే బాధ్యుడని తెలిపింది. ఈమేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్పేరిట మీడియాకు లేఖ విడుదల చేశారు. ఏపీలోని మారేడుమిల్లి దగ్గర జరిగిన హిడ్మా ఎన్కౌంటర్తో తమ పార్టీకి చెందిన దేవ్జీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన ఇచ్చిన సమాచారం మేరకే ఎన్కౌంటర్ జరిగిందంటూ మాజీ ఎమ్మెల్యే మనీశ్ కుంజాం, సోని సోడీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు.
చిత్రహింసలు పెట్టి చంపిన్రు..
తమ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాను, ఆయనతో ఉన్న ఐదుగురిని ఏపీ పోలీసులు నవంబర్ 15న అరెస్టు చేసిశారని మావోయిస్టు పార్టీ లేఖలో పేర్కొన్నది. మూడు రోజుల పాటు చిత్రహింసలు పెట్టి.. నవంబర్ 18న హత్య చేశారని తెలిపింది. కామ్రేడ్ హిడ్మా అక్టోబర్ 27న విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్లారని పేర్కొన్నది. ఆ తర్వాత మరి కొద్దిమంది వెళ్లారని తెలిపింది. నిరాయుధంగా ఉన్న కామ్రేడ్స్ హిడ్మాసహా ఆరుగురిని పట్టుకొని హత్య చేసి.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో పడేసి, ఎన్కౌంటర్ కథ అల్లారని ఆరోపించింది. నవంబర్ 19న కూడా నిరాయుధులైన ఏఓబీ ఎస్.జెడ్.సి. సభ్యుడు కామ్రేడ్ శంకర్ను, మరో ఆరుగురిని అరెస్టు చేసి బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారని తెలిపింది.
పార్టీ నుంచి పారిపోయి పోలీసులకు లొంగిపోయిన వ్యక్తులే ఇన్ఫార్మర్లుగా మారి వారి సమాచారం ఇచ్చినట్లు ఇప్పుడు అర్థమవుతున్నదన్నారు. ‘‘నవంబర్ 9న మా బలగాల నుంచి కోసాల్ అనే పార్టీ కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండరయ్యాడు. ఈయనకు కామ్రేడ్ హిడ్మా ప్రయాణ వివరాలు, ఆయన బయట ఉంటున్న విషయం తెలుసు. కోసాల్ పారిపోయిన వెంటనే కామ్రేడ్ హిడ్మాకు విషయం తెలియజేశారు. వెంటనే లోపలికి రమ్మని కామ్రేడ్స్హెచ్చరించారు.
కానీ ఈలోపలే పోలీసులు హిడ్మా, ఆయన అనుచరులను హత్య చేశారు” అని వికల్ప్తెలిపారు. ‘‘విజయవాడ, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని 50 మంది మావోయిస్టుల అరెస్టులకు వాళ్లను తీసుకెళ్లిన విజయవాడకు చెందిన కలప, ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్, సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ .. ఇలా ఈ ముగ్గురే కారకులు. వాళ్లతోపాటు మా నుంచి పారిపోయి మా కామ్రేడ్స్ ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాల్ కూడా కారణమే”అని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది.
దేవ్జీ పోలీసుల అదుపులో లేడు!
కోసాల్ పారిపోయిన తర్వాత లోపలికి రావడానికి సిద్ధమవుతున్న తమ కామ్రేడ్స్ను పోలీసులు పట్టుకొని, 13 మందిని హత్య చేశారని వికల్ప్ తెలిపారు. మరో 50 మందిని అరెస్టు చేశారని, ఇందులో కామ్రేడ్స్ దేవ్జీగానీ, సంగ్రాం (మల్లా రాజిరెడ్డి) గానీ లేరని పేర్కొన్నారు. వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని, కామ్రేడ్స్ హిడ్మా తదితరుల సమాచారం కామ్రేడ్ దేవ్జీ పోలీసులకు ఇవ్వలేదని తెలిపారు.
ఈ వాస్తవాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, ఏపీ, తెలంగాణ, చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు స్పష్టంగా తెలుసని చెప్పారు. ఇది కేవలం ఏపీ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదని, ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్ అని, దీనంతటికి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే కారణమని అన్నారు. అయితే,హిడ్మా హత్యకు కామ్రేడ్ దేవ్జీ కారణమంటూ మాజీ ఎమ్మెల్యే మనీశ్ కుంజాం, సోని సోడీ ఆరోపించడం కుట్రపూరితమన్నారు. వీరి ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మావోయిస్టు పార్టీ విడుదల చేసిన లేఖలో వికల్ప్ పేర్కొన్నారు.
