
- ప్రజాస్వామిక పోరాటం వైపు అడుగులు
- ఉత్తర భారత దేశం కేంద్రంగా యాక్షన్ ప్లాన్!
- ఆపరేషన్ కగార్ నేపథ్యంలో సరికొత్త వ్యూహం
- అర్బన్ ఏరియాలు కేంద్రాలుగా వర్గ పోరాటం!
హైదరాబాద్: ఆపరేషన్ కగార్ మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని దెబ్బతీసింది. సాయుధ పోరాట పంథాయే సరైన మార్గమని నమ్మి అడవిబాట పట్టిన అన్నలు ఒక్కొరొక్కరుగా ఒదిగిపోయారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 550 మంది మావోయిస్టులు భద్రతా దళాల కాల్పుల్లో మరణించారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు కేంద్ర కమిటీ సభ్యులు ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి వయోభారంతో ఇబ్బంది పడుతున్నారు. భద్రతాదళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో అనేకమంది అగ్రనేతలు మృత్యువాత పడ్డారు.
మృతుల్లో అగ్రనేతలు నంబాల, చలపతి, ప్రయాగ్ మాంఝీ, సుధాకర్, గాజర్ల రవి తదితరులో పాటు పలువురు ఉన్నారు. దీంతో భద్రతాబలగాలతో పోరాడలేని స్థితిలోకి పీఎల్జీఏ దళాలు చేరాయి. దండకారణ్యంలో నిర్భంధం అధికమవడంతో పార్టీ అగ్రనాయకత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నది. మావోయిస్టులు ప్రతిపాదించిన కాల్పుల విరమణకు సైతం ప్రభుత్వం సుముఖంగా లేకపోవడంతో పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. దండకారణ్యంలో పీపుల్స్ లిబరేషన్ గెరిళ్లా ఆర్మీ దళాలు ఇప్పటికే చెల్లా చెదురయ్యాయి. మావోయిస్టుల హ్యూమన్ నెట్వర్క్ ను భద్రతాబలగాలు దెబ్బతీయడంతో ప్లాటూన్ల మధ్య సమాచార మార్పిడికి తీవ్ర అవరోధం ఏర్పడుతోంది.
దీంతో పోరాట పంథాను మార్చుకునేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ క్యాడర్ ను తాత్కాలికంగా డియాక్టివేట్ చేయాలనే ఆలోచనలో మావోయిస్టు పార్టీ ఉంది. ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసి ఉత్తర భారత దేశం కేంద్రంగా ప్రజాస్వామిక పోరాటం చేయాలనే యోచనలో ఉందని సమాచారం. విప్లవభావాజాలం కలిగిన విద్యార్థి సంఘాలను నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తోంది.
అడవులను వీడి అర్బన్ ఏరియాలే కేంద్రంగా వర్గపోరాట నినాదం ముందుకు సాగాలని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అత్యాధునిక ఆయుధ సంపత్తితో అధునాతన సాయుధ సైన్యాన్ని నిర్మించుకోవాలని బహుముఖ వ్యూహం పన్నుతుంది. కొద్ది రోజుల పాటు దక్షిణ, మధ్య భారత దేశంలో కార్యకలాపాలను తగ్గించి ఈశాన్య, ఉత్తర భారత దేశంలో ప్రజాపోరాటాలు పెంచాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం.