పోలీసుల ఉచ్చులో మావోయిస్టులు?

పోలీసుల ఉచ్చులో మావోయిస్టులు?

తిర్యాణి అడవుల్లో ముమ్మరంగా కూంబింగ్
డీజీపీ పర్యటనలతో బలపడుతున్న అనుమానాలు

ఆదిలాబాద్, వెలుగు: రెండు రోజుల క్రితం తిర్యాణి అటవీ ప్రాంతంలో పోలీసుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న మావోయిస్టులు తాజాగా బలగాల ఉచ్చులో చిక్కినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పోలీస్ బాస్, డీజీపీ మహేందర్రెడ్డి శుక్రవారం స్వయంగా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్లి కూంబింగ్ ఆపరేషన్ ను పర్యవేక్షించడం అనుమానాలకు బలం చేకూరుతోంది.

వలస కూలీల రూపంలో..
కరోనా లాక్డౌన్ టైంలో వలస కూలీల రూపంలో మావోయిస్టులు జిల్లాలోకి ప్రవేశించినట్లు పోలీసులు భావిస్తున్నారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, అతని సహచరి కంతి లింగవ్వతో బాటు మరో ఏడెనిమిది మంది మావోయిస్టులు తిర్యాని అడువుల్లో తలదాచుకున్నట్లు ఇన్ఫార్మర్ల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలు ముమ్మరంగా కూంబింగ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆరు రోజుల క్రిత౦ అడెల్లు దళం తలదాచుకున్న శిబిరంపై పోలీసులు దాడి జరపగా త్రుటిలో తప్పించుకున్నారని చెప్పిన పోలీసులు, ఆ క్యాంపు నుంచి కీలక డాక్యుమెంట్లు, ఆహార సామగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.

ఏ క్షణంలోనైనా దాడి..?
మావోయిస్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా చూడాలని భావించిన పోలీసులు, వివిధ జిల్లాలు, హైదరాబాద్ నుంచి మరిన్ని ప్రత్యేక బలగాలను రప్పించి అడవులను చుట్టుముట్టారు. మావోయిస్టులకు ఆశ్రయమిచ్చిన వ్యక్తిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని అతడి నుంచి సమాచారం రాబట్టినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం మైలారపు అడెల్లు, అతని భార్య కంతి లింగవ్వతో బాటు మరికొంతమంది మావోయిస్టులు పోలీసు వలయంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శుక్రవారం డీజీపీ మహేందర్ రెడ్డి ఆసిఫాబాద్ చేరుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మావోయిస్టులను త్వరలో పట్టుకుంటాం
తెలంగాణ వ్యాప్తంగా మావోయిస్టుల కదలికల పై నిఘా పెట్టామని, తిర్యాణి అడవుల్లో ముమ్మరంగా కూంబింగ్ సాగుతోందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ఐదు వందల మంది స్పెషల్ పార్టీ, గ్రేహౌండ్స్ పోలీసులు గాలిస్తున్నారని, రెండుసార్లు తప్పించుకుపోయిన మావోయిస్టులను త్వరలోనే పట్టుకుని చట్టం ముందు ఉంచుతామన్నారు. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో పోలీసు అధికారులతో మీటింగ్లో పాల్గొన్న తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రశాంతంగా ఉందని, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని అన్నారు. నక్సలైట్ల సమస్య లేకపోవడంతో మారుమూల పల్లెల్లో రోడ్లు, తాగునీరు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లాంటి పనులు జరిగాయని, ఆదివాసీలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందాయన్నారు. బోధ్కు చెందిన మైలారపు ఆడెల్లు అలియాస్ భాస్కర్ నాయకత్వంలో ఐదుగురు సభ్యుల టీమ్ జిల్లాలో తిరుగుతుందన్న సమాచారం ఆదివాసీల్లో ఆందోళనను కలిగిస్తోందని, ఇప్పటివరకు అందిన వెల్ఫేర్ స్కీంలు దూరమవుతాయన్న భయం వారిలో వ్యక్తమవుతోందని అన్నారు. ప్రజలు, ఆదివాసీలు మావోయిస్టులకు ఎలాంటి సహాయాన్ని చేయవద్దని కోరారు. నక్సలైట్ల వల్ల అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటుందన్నారు. జిల్లా పోలీసుల పనితీరు బాగుందని అభినందించారు. మీటింగ్లో నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, రామగుండం కమిషనర్ సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్, జిల్లా ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఎ ఎస్పీ వైవీఎస్ సూధేంద్ర పాల్గొన్నారు.

మేం కంట్రోల్లో ఉన్నా.. దాడులేందీ
మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్

భద్రాచలం, వెలుగు: కరోనా కాలంలో తాము స్వీయ నియంత్రణ పాటిస్తూ భౌతిక దాడులకు దూరంగా ఉండగా, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తమ దళాలను నిర్మూలించే ప్రయత్నాలు చేస్తున్నాయని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‍ ఆరోపించారు. ఈనెల 15న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని మల్లేపల్లితోగు, ఆసిఫాబాద్‍ జిల్లా తిర్యాణిలో జరిగిన దాడులను ఆయన ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు. మణుగూరు మొదలు కొని ఆసిఫాబాద్‍ వరకు గ్రేహౌండ్స్, స్పెషల్‍ పార్టీ బలగాలతో కూంబింగ్‍ ఆపరేషన్లు చేస్తున్నారన్నారు. ఆపరేషన్‍ ప్రహార్‍ పేరుతో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‍గఢ్‍, మహారాష్ట్రలలో జాయింట్‍ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని విమర్శించారు. గత జనవరి నుంచి జరిపిన దాడుల్లో సృజన, అభిలాష్‍ సహా 40 మంది చనిపోయారన్నారు. లాక్ డౌన్‍వేళ తమ కార్యకర్తలు ప్రజలను చైతన్యపరుస్తుంటే, ప్రజారోగ్యాన్ని పక్కనబెట్టి పోలీసులు తమపై దాడులు చేస్తున్నారన్నారు. తెలంగాణలో పాశవిక అణచివేతను కొనసాగిస్తున్నారన్నారు.

For More News..

పైలట్ వర్గానికి ఊరటనిచ్చిన రాజస్థాన్ హైకోర్టు

లవర్ కోసం నడుస్తూ పాక్ బార్డర్ చేరిన యువకుడు

కరెంటోళ్లు కూడా బిల్లులు కడతలే!