
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం మావోయిస్టులు డీఆర్జీ జవానుపై దాడి చేశారు. మావోయిస్టు పార్టీ స్మాల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇద్దరు మావోయిస్టులు జిల్లాలోని పడేటా మార్కెట్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. డీఆర్జీ జవాను సంతూ పోతం మార్కెట్లోకి వెళ్లిన సమయంలో అక్కడే కాపు కాసి ఉన్న ఇద్దరు మావోయిస్టులు గొడ్డలితో ఒక్కసారిగా దాడికి దిగారు. మార్కెట్లో జనం అలికిడితో తీవ్రగాయాల పాలైన సంతూ పోతంను అక్కడే వదిలేసి పారిపోయారు. గాయాలపాలైన జవాన్ను ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో బీజాపూర్ పోలీసులు అప్రమత్తమయ్యారు.