215 పాయింట్లు పడిన సెన్సెక్స్
న్యూఢిల్లీ: టెలికం, రియల్టీ, టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో దేశ మార్కెట్లు బుధవారం తమ ఓపెనింగ్ లాభాలను కోల్పోయి నష్టాల్లో ముగిశాయి. ఫెడ్ మీటింగ్కు ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని ఎనలిస్టులు పేర్కొన్నారు. మరోవైపు డాలర్ మారకంలో రూపాయి పతనం కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. సెన్సెక్స్ తమ నాలుగు రోజుల లాభాలకు బ్రేక్లు వేస్తూ బుధవారం 215 పాయింట్ల (0.35 %) నష్టంతో 60,906 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి 18,083 వద్ద ముగిసింది.
సెన్సెక్స్లో ఎయిర్టెల్, మారుతి, హిందుస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్, టైటాన్, హెచ్సీఎల్ టెక్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి. సన్ ఫార్మా, ఐటీసీ, టెక్ మహీంద్రా, డా.రెడ్డీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. ఫెడ్ పాలసీ డిటెయిల్స్ వెలువడే ముందు మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో మార్కెట్ పడిందన్నారు. మరోవైపు యూఎస్లో ఎంప్లాయ్మెంట్ డేటా మెరుగ్గా ఉండడంతో వడ్డీ రేట్ల పెంపు స్లో అవుతుందనే అంచనాలు తగ్గాయి. ‘మార్కెట్ ఇప్పటికే 75 బేసిస్ పాయింట్ల పెంపునకు రెడీ అయ్యింది. ఫెడ్ కామెంట్స్ బట్టి మార్కెట్ కదలికలు ఉంటాయి’ అని వినోద్ నాయర్ అన్నారు. బ్రాడ్ మార్కెట్ చూస్తే బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ బుధవారం 0.12 % తగ్గగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.23 % నష్టపోయింది. సెక్టార్ల పరంగా చూస్తే టెలీకమ్యూనికేషన్, టెక్, యుటిలిటీస్, ఆటో, ఐటీ ఇండెక్స్లు ఎక్కువగా పడ్డాయి. మెటల్, హెల్త్కేర్, ఎనర్జీ, కమొడిటీ ఇండెక్స్లు లాభాల్లో ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 19 పైసలు తగ్గి 82.78 వద్ద క్లోజయ్యింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్కు 94.81 డాలర్ల వద్ద కదులుతోంది.