స్టాండింగ్ కమిటీకి బాల్య వివాహ నిరోధక సవరణ బిల్లు

స్టాండింగ్ కమిటీకి బాల్య వివాహ నిరోధక సవరణ బిల్లు

ఢిల్లీ : బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు ప్రవేశపెట్టడంపై లోక్ సభలో వాడీ వేడి చర్చ జరిగింది. అమ్మాయిల పెళ్లి వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయాలను తెలుసుకోకుండానే కేంద్రం ఏక పక్ష నిర్ణయం తీసుకుందని విపక్ష ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లును తొలుత స్టాండింగ్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వం బాల్య వివాహాల నిరోధక చట్ట సవరణ బిల్లును స్టాండింగ్ కమిటీకి పంపింది.  
అంతకు ముందు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ బాల్య వివాహాల నిరోధక సవరణ బిల్లు 2021ను లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. అన్ని మతాల్లో వివాహ వయసు ఒక్కటిగా ఉండాలని అన్నారు. ఈ సవరణ బిల్లుతో మహిళల కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెరుగుతుందని, బిల్లుకు మద్దతిచ్చిన సభలోని పురుష సభ్యులందరికీ స్మృతి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమన్న ఆమె.. మహిళలు, పురుషుల పట్ల తమకెలాంటి భేదభావం లేదని చెప్పారు. అమ్మాయిలు 18 ఏళ్లకే గర్భం దాల్చితే అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, పెళ్లి వయసు పెంచితే అలాంటి ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని స్మృతి అభిప్రాయపడ్డారు. ఈ బిల్లు తీసుకొచ్చిన ప్రధానికి దేశ మహిళల తరఫున థ్యాంక్స్ చెప్పారు. 
స్మృతి ప్రవేశపెట్టిన బిల్లుపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తొందరపడి ఈ బిల్లును ప్రవేశపెట్టిందని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ అభిప్రాయపడ్డారు. ఎవరితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా తెచ్చిన బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయాలని డిమాండ్ చేశారు. తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సైతం బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను సంప్రదించకుండా బిల్లులు ప్రవేశపెట్టడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే విమర్శించారు. విపక్ష సభ్యుల అభ్యంతరాలపై స్పందించిన మంత్రి స్మృతి ఇరానీ బిల్లును వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష ఎంపీలు మహిళలను సమానత్వ హక్కుకు దూరం చేస్తున్నారని విమర్శించారు. బాల్య వివాహ నిరోధక సవరణ బిల్లు 2021ని స్టాండింగ్ కమిటీకి పంపుతున్నట్లు ప్రకటించారు.

For more news

మాజీ సర్పంచ్ ను కిడ్నాప్ చేసిన మావోలు

వారంలో నాలుగు రోజులే పని

క్యారీ బ్యాగులపై డబ్బులు వసూలు చేస్తే ఫైన్ తప్పదు