వినియోగదారులకు గుడ్ న్యూస్ . ఇక నుంచి క్యారీ బ్యాగులకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. మాల్స్, మార్ట్స్ ఎక్కడ షాపింగ్ చేసినా క్యారీ బ్యాగ్ పై అదనపు రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇకపై కస్టమర్లకు క్యారీ బ్యాగ్ లను ఫ్రీగా ఇవ్వాలని వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైదర్ గూడ డిమార్ట్ పై ఉన్న కేసును వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా కీలక తీర్పు ఇచ్చింది వినియోగదారుల ఫోరమ్ కోర్టు.
అశోక్ కుమర్ అనే వ్యక్తి వినియోగదారుల ఫోరమ్ కోర్టును ఆశ్రయించారు. తమ నుంచి క్యారీ బ్యాగ్ కోసం డీమార్ట్ రూ.3.50పై వసూలు చేసిందని..వసూలు చేసిన డబ్బులతో పాటు రూ.30 వేల రూపాయలను పరిహారంగా చెల్లించాల్సిందిగా ఫోరంను కోరారు. అయితే కేసు విచారించిన వినియోగదారుల ఫోరమ్ కోర్టు..వినియోగదారుల నుండి క్యారీ బ్యాగ్ కోసం 3 రూపాయల 50 పైసలు తిరిగి చెల్లించడంతో పాటు పరిహారంగా 1,000 రూపాయలు న్యాయ సేవాకేంద్రానికి.. మరో1,000 రూపాయలు వినియోగదారునికి చెల్లించాలని హైదర్ గూడ డిమార్ట్ ను ఆదేశించింది కోర్టు. ఇప్పటి నుండి ఎలాంటి క్యారీ బ్యాగ్ కు డబ్బులు వసూలు చేయోద్దు అని వినియోగదారుల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 45 రోజుల్లో తీర్పు అమలు కాకపోతే చెల్లించాల్సిన మొత్తానికి 18 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని తెలిపింది వినియోగదారుల ఫోరమ్ న్యాయస్థానం.