న్యూఢిల్లీ: ప్రస్తుత జనరేషన్లో పెళ్లికి ముందే శృంగారం చాలా కామన్ అయిపోయింది. లవ్, లీవ్ ఇన్ రిలేషన్షిప్ అంటూ పెళ్లి తర్వాత కావాల్సిన తంతును ముందే ముగించేస్తున్నారు. ఆ తర్వాత ఏమైనా విభేదాలు వచ్చి విడిపోయాక మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఈ క్రమంలో పెళ్లికి ముందే శృంగారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహానికి ముందు అబ్బాయి, అమ్మాయి అపరిచితులు అని.. ఈ సమయంలో శారీరక సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. వివాహానికి ముందు ఎవరినీ నమ్మవద్దని పేర్కొంది.
మ్యాట్రిమొనీ వెబ్సైట్ ద్వారా ఓ మహిళాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక సార్లు ఢిల్లీ, దుబాయ్లో ఇద్దరు శారీరంగా కలిశారు. కొన్నిరోజుల తర్వాత మహిళా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా అందుకు సదరు వ్యక్తి నిరాకరించాడు. అంతేకాకుండా ఇద్దరూ ఏకాంతంగా గడిపిన వీడియోలు తీసి మహిళను బ్లాక్ మెయిల్ చేశాడు. అతడికే అప్పటికే మరో మహిళతో పెళ్లి అయ్యింది. ఈ విషయం తెలియడంతో మోసపోయానని గ్రహించిన సదరు మహిళా పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతడు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం సోమవారం (ఫిబ్రవరి 16) ఈ పిటిషన్ను విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి అపరిచితులేనని.. దీంతో వివాహానికి ముందే శారీరక సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హితవు పలికింది.
ఒకరిపై ఒకరికి ఎంత నమ్మకం ఉన్నప్పటికీ వివాహానికి ముందు ఎవరినీ నమ్మవద్దని సూచించింది. ఈ సందర్భంగా జస్టిస్ బి.వి. నాగరత్న మాట్లాడుతూ.. ‘‘బహుశా మేము పాతకాలపు ఆలోచనల వాళ్లమేమో.. కానీ వివాహానికి ముందు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పరస్పరం అపరిచితులే. వారి మధ్య బంధం ఎంత గాఢంగా ఉన్నప్పటికీ పెళ్లికి ముందే శారీరక సంబంధంలోకి ఎలా వెళ్తారో మాకు అర్థం కావడం లేదు. మా రోజుల్లో అయితే ఇలా లేదు. పెళ్లికి ముందు ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు’’ అని వ్యాఖ్యానించారు.
పెళ్లికి ముందే అతడిని గుడ్డి నమ్మి ఇతర ప్రదేశాలకు వెళ్లి శారీరంగా ఎందుకు కలిశారని బాధిత మహిళను నిలదీసింది. ఎంత నమ్మకం ఉన్నప్పటికీ పెళ్లికి ముందు అపరిచితులేనని స్పష్టం చేసింది. ఇలాంటి కేసులు విచారణ చేసి శిక్ష విధించేందుకు తగినవికావని పేర్కొన్న ధర్మాసనం.. ఇరుపక్షాలను మధ్యవర్తిత్వం (మెడియేషన్)కు పంపాలని సూచించారు. అనంతరం కేసు విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
