అమరవీరుల స్మారక స్తూపం గన్​పార్క్​

అమరవీరుల స్మారక స్తూపం గన్​పార్క్​

తెలంగాణ అమరవీరుల స్తూపం గన్​పార్క్​కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 1969లో ప్రారంభమైన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో 369మంది తెలంగాణవాదులు తమ ప్రాణాలను కోల్పోయారు. వీరి స్మారకార్థంగా హైదరాబాద్​ నడిబొడ్డున ఒక స్తూపం నిర్మించాలని ప్రతిపాదించి 1969 మే 31న నిర్ణయించుకున్నారు. ఆనాటి హైదరాబాద్​ మేయర్​ లక్ష్మీనారాయణ 1970 ఫిబ్రవరి 23న అసెంబ్లీ సమీపంలో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గన్​పార్క్​ రూపశిల్పి ఎక్కా యాదగిరి రావు పునాది వేసే సమయంలో భావితరాలకు ఈ వాస్తవ చరిత్రను తెలియజేయాలని భావించి 1969 ఉద్యమంలో చోటుచేసుకున్న పరిణామాలు ఒక తామ్ర పత్రంపై రాసి అందులో భద్రపరిచారు. 

ఉద్యమ సమయంలో వార్తా పత్రికల్లో ప్రచురించిన వార్తలను పాలిథిన్​ కవర్లో చుట్టి అందులో ఉంచారు. అందుకే గన్​పార్క్​ కేవలం స్మారక స్తూపమే కాదు చరిత్రను తన కడుపులో దాచుకున్న పవిత్ర నిర్మాణంగా చెప్పవచ్చు. 1975లో గన్​పార్క్​ నిర్మాణం పూర్తయింది. నల్లరాయితో చేసిన స్తూపం నాలుగు వైపులా తొమ్మిది చొప్పున చిన్నచిన్న రంధ్రాలను అమరవీరుల శరీరాల్లోకి దూసుకుపోయిన బుల్లెట్​ గుర్తులుగా ఏర్పాటు చేశారు. ఎరుపురంగులో కనిపించే గన్​పార్క్​ ఆవరణలో సాంచీస్తూపం నుంచి సేకరించిన ఒక మకరతోరణం ఉంది. తెలంగాణ తొమ్మిది జిల్లాల సంకేతంగా(అప్పటికి రంగారెడ్డి జిల్లా ఏర్పడలేదు) స్తూపం మధ్యభాగంలో గల స్తంభంపై ఏ వైపు నుంచి చూసినా దానిపై తొమ్మిది గీతలు కనిపిస్తాయి. 25 అడుగుల ఎత్తులోని ఈ స్తూపం పై భాగంలో అశోకుని ధర్మచక్రంతోపాటు తెలుపు రంగులో తొమ్మిది రేకులు గల ఒక పుష్పం ఉంటుంది.