
- 30 గ్రామాలకు సాగు నీరందించే మాసబ్ చెరువు మాయమైతున్నది
- కొద్దికొద్దిగా కబ్జాకు గురవుతూ.. వందల ఎకరాలు కనుమరుగు
- మంత్రి కేటీఆర్ అభివృద్ది చేస్తానన్న చెరువు ఆక్రమణ
- ‘సేవ్ మాసబ్ చెరువు’ పేరుతో పార్టీలకతీతంగా నాయకులు, స్థానికుల పోరాటం
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: గ్రేటర్ శివారులోని మాసబ్ చెరువు కబ్జాకు గురవుతోంది. పకడ్బందీగా వ్యవహరిస్తూ ఆక్రమణదారులు కొద్దికొద్దిగా కబ్జా చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు ఈ ఆక్రమణలను పట్టించుకోవడం లేదు. దీంతో పార్టీలకతీతంగా నాయకులు, స్థానికులు ఏకమై పోరాటం చేస్తున్నారు. చెరువు రక్షణ కోసం కొట్లాడుతున్నరు.
506 నుంచి 326 ఎకరాలకు..
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ.. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు అక్కడి మాసబ్ చెరువు సుమారు 506 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కొంతకాలంగా కొందరు రియల్టర్లు కొద్దిగా కొద్దిగా కబ్జా చేస్తుండడంతో చెరువు విస్తీర్ణం 326 ఎకరాలకు తగ్గిపోయింది. చెరువులోకి నీళ్లు రాకుండా కబ్జాదారులు నాలాలను నిర్మించి అడ్డుకుంటున్నారు. ఏండ్ల చరిత్ర ఉన్న చెరువు ఇలా కనుమరుగైపోతే భవిష్యత్ తరాలకు ఇబ్బందులు తప్పవని గుర్తించిన స్థానికులు చెరువును కాపాడుకునేందుకు నడుం బిగించారు. పార్టీలకు అతీతంగా పొలిటికల్ లీడర్లు, స్థానికులు ఏకమై ‘సేవ్ మాసబ్ చెరువు’ పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నారు. దాని ద్వారా కోఆర్డినేట్ చేసుకుంటూ కబ్జాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిత్యం చెరువు వద్ద కాపలా ఉంటూ ఎవరైనా మట్టి నింపుతున్నా, రాళ్లు తెచ్చి వేసి ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నా వారిని అడ్డుకుంటున్నారు.
ప్రభుత్వ పెద్దల సహకారంతోనే!
ప్రభుత్వ పెద్దల సహకారంతోనే వందల ఏండ్ల చరిత్ర కలిగిన ఈ చెరువు కబ్జా జరుగుతోందని కొందరు స్థానికులు, ప్రజాప్రతినిధిలు ఆరోపిస్తున్నారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న కొందరు రైతుల భూమిని కొనేసిన రియల్టర్లు చెరువులోకి జరిగి కబ్జా చేసేస్తున్నారు. అయితే దీని వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అందుకే స్టేట్ లెవెల్ ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. ఎఫ్టీఎల్లో నిర్మాణాలు జరిపేందుకు ఇరిగేషన్ అధికారులు ఎన్వోసీ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.
రెండేళ్ల కింద అభివృద్ది పనులు...
రెండేండ్ల కిందట ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దుతామని చెప్పిన మంత్రి కేటీఆర్ పనులను ప్రారంభించారు. ఇంకా కొంత అభివృద్ది చేయాల్సి ఉండగా ఆ నిధులు విడుదల కాలేదు. కానీ కబ్జాలు మాత్రం కొనసాగుతున్నాయి. గుర్రంగూడ వైపు చెరువుకు సంబంధించిన స్థలంలో రోడ్డు వేస్తుండగా గమనించిన స్థానికులు సోమవారం అడ్డుకుని ఆందోళనకు దిగారు.మంగళవారం అధికారులు వచ్చి జేసీబీలతో మట్టిని తొలగించి వెళ్లారు.
ఎన్నిసార్లు ఫిర్యాదులు ఇచ్చినా..
చెరువు కబ్జా విషయంలో రాష్ట్ర, జిల్లా స్థాయి ఇరిగేషన్ అధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని స్థానికులు వాపోతున్నారు. చెరువు కబ్జా వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. జిల్లా కలెక్టర్ తో పాటు స్టేట్ లెవెల్ ఇరిగేషన్ అధికారులకు సైతం ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కబ్జా చేస్తున్న సంస్థపై చర్యలు తీసుకొని చెరువును రక్షించాలని, చెరిగిన హద్దులను మళ్లీ ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ కోమటిరెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఇటీవల లెటర్ రాశారు. ఇదే తరహాలో స్థానికుల నుంచి కూడా చాలా ఫిర్యాదులు వెళ్లాయి. అయినా కూడా అధికారులు స్పందించడం లేదు. సుమారు 30 గ్రామాలకు సాగునీరు అందిస్తున్న చెరువును కబ్జా చేసి, అక్కడ 60 ఫీట్ల రోడ్డు కూడా వేశారు.
బీఆర్ఎస్ నేతలు, అధికారులే కారణం
అధికార పార్టీ అగ్రనేతలు,అధికారుల కనుసన్నల్లోనే చెరువు కబ్జాకు గురవుతోంది. మేము చిన్నప్పటి నుంచి చూసిన అందమైన చెరువు అంతరించి పోతుంటే చూడలేక పోరాడుతున్నాం ఈ పోరాటం ఎంతటివరకైనా కొనసాగుతుంది. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా చెరువు కబ్జాపై స్పందించి చర్యలు తీసుకోవాలి.
- బచ్చిగళ్ల రమేశ్, తుర్కయంజాల్
చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ అధికారులు దొంగ ఎన్ వోసీలు ఇచ్చి ఈ చెరువు కబ్జాకు కారకులు అవుతున్నారు. గతంలో ఇచ్చిన ఎన్ వోసీలను క్యాన్సిల్ చేసి తిరిగి రీ సర్వే చేసి అంతరించి పోతున్న చెరువును కాపాడి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి.
-- - ఐలయ్య, మాజీ సర్పంచ్, కమ్మగూడ