ముంబై: మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాగ్పూర్ జిల్లాలోని కటోల్ తాలూకా రౌల్గావ్లోని ఎస్బీఎల్ కంపెనీలో ఆదివారం (మార్చి 1) ఉదయం 7 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ భయంకరమైన పేలుడులో 12 మంది కార్మికులు మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ పేలుడు ధాటికి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
భారీగా మంటలు ఎగిసిపడటంతో భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.
గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషయంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఘటన స్థలంలో ముమ్మరంగా సహయక చర్యలు కొనసాగుతున్నాయి.
