‘మాట్రిమోనియల్’ మోసాలు ఎక్కువైతున్నయ్
హెచ్చరించిన కేంద్ర హోం శాఖ
పెండ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఆన్లైన్లో సంబంధాలు వెతుకుతున్నారా? కాస్త జాగ్రత్త. ఈ మధ్య మాట్రిమోనియల్ స్కామ్లు ఎక్కువైతున్నాయి. పుణేకు చెందిన ఓ టెకీ.. మాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పరిచయమైన ఓ మోసగాడి దెబ్బకు రూ. 10 లక్షలు పోగొట్టుకున్నారు. మరో కేసులో ఓ వెబ్సైట్ ద్వారా పరిచయమైన ఓ మహిళ (కాబోయే భార్య).. అర్జెంటు అవసరమని డబ్బు అడగ్గానే పంపిన ఓ వ్యక్తి.. డబ్బులేశాక మోసపోయానని తెలుసుకున్నాడు. ఈమధ్యన ఇలాంటి మోసాలు ఎక్కువవడంతో కేంద్రం అప్రమత్తమైంది. మాట్రిమోనియల్ సైట్లో సంబంధం చూసుకునే వాళ్లకు సూచనలిచ్చింది.
కొత్త ఈ మెయిల్ వాడాలి
మాట్రిమోనియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యే ముందు కొత్త ఈమెయిల్ను క్రియేట్ చేసుకోవాలని, ఆ ఈ మెయిల్తోనే మాట్లాడుకోవాలని కేంద్ర హోం శాఖ సూచించింది. ఫొటో, ఫోన్ నంబర్, అడ్రస్ లాంటి పర్సనల్ డేటాను ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోవద్దంది. ఈ మేరకు సైబర్ దోస్త్ అధికారిక వెబ్సైట్ ద్వారా సూచనలను ట్వీట్ చేసింది. మాట్రిమోనియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యే ముందు ఆ వెబ్సైట్ ఎలాంటిదో, ఎంత మేరకు నమ్మొచ్చో తెలుసుకోవాలంది. ఇందుకోసం ఫ్రెండ్స్, ఫ్యామిలీ, తెలిసిన వాళ్ల సాయం తీసుకోవాలని చెప్పింది. ఇంకా కుదిరితే ఆన్లైన్లో సంబంధాలు చూసుకొని పెళ్లి చేసుకున్న వాళ్లతో మాట్లాడాలని సూచించింది. పెండ్లి సంబంధం, పెండ్లి కూతురు/కొడుకు విషయాన్ని ఫ్రెండ్స్, ఫ్యామిలీతో పంచుకోవాలంది.
టెకీలు, ఎన్నారైలు టార్గెట్
ఫేక్ మాట్రిమోనియల్ సైట్ల ద్వారా పరిచయమైన వాళ్లు అర్జెంటు అవసరమంటూ రకరకాల బ్యాంకు అకౌంట్లకు డబ్బులు పంపించమని కోరతారు. డబ్బులు వచ్చాక కనెక్షన్ కట్ అయిపోతుంది. ఇంకొన్ని సందర్భాల్లో కాబోయే భర్త/భార్య విదేశం నుంచి విలువైన గిఫ్ట్ పంపారని, ట్యాక్స్ డబ్బు కడితే ఇస్తామని కస్టమ్స్ ఆఫీసు నుంచి ఫోన్ వస్తుంది. అకౌంట్లో డబ్బులేశాక ఫేక్ అని అర్థమవుతుంది. ఎక్కువగా టెకీలు, ఎన్నారైలు, హై ఇన్కమ్ గ్రూపులను మోసగాళ్లు టార్గెట్ చేస్తున్నారు.