- మేయర్ గుండు సుధారాణి
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు : డీస్లడ్జింగ్ ఆపరేటర్లు సెప్టిక్ ట్యాంక్ వర్కర్లు నమస్తే (నేషనల్ ఆక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఏకో సిస్టమ్) కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి సూచించారు. గురువారం బల్దియా హెడ్ ఆఫీస్లోని కౌన్సిల్ హాల్లో డి స్లెడ్జింగ్ ఆపరేటర్లు సెప్టిక్ ట్యాంక్ వర్కర్లకు నమస్తే కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మల వ్యర్థాలు నిర్వహించే సిబ్బందికి నమస్తే కార్యక్రమం ఎంతో ఉపయుక్తమన్నారు. మాన్యువల్ పద్ధతికి పూర్తిగా చెక్ పెట్టి, డ్రైన్స్ నుంచి వ్యర్థాలను యంత్రాలతోనే తొలగించాలని చెప్పారు. ఇది కార్మికుల భద్రతకు, పరిశుభ్రత ప్రమాణాలకు అత్యంత అవసరమన్నారు. డీ -స్లడ్జింగ్ కార్యకలాపాలను సురక్షితంగా నిర్వహించేందుకు ఎంపానెల్ చేసిన ఏజెన్సీ ద్వారా ఆపరేటర్లకు శిక్షణ అందిస్తున్నామని తెలిపారు.
మరింత సమర్థంగా సేవలు అందించేందుకు ప్రతి ఆపరేటర్కు మూడు వార్డులను కేటాయించి, ప్రతి మూడు నెలలకు ఒకసారి సెప్టిక్ ట్యాంకుల డీ-స్లడ్జింగ్ తప్పనిసరిగా చేపట్టేలా షెడ్యూల్ రూపొందిస్తున్నామని వివరించారు. సెప్టిక్ ట్యాంకు ఆపరేటర్లు టోల్ ఫ్రీ నంబర్ 11420 పై ప్రజల్లో చైతన్యం కల్పించాలని చెప్పారు. ప్రతి మూడేండ్లకు ఒకసారి సెప్టిక్ ట్యాంకు శుభ్రపరచుకునేలా ప్రోత్సహించాలని తెలిపారు. కార్యక్రమంలో సీఏం హెచ్ వో డాక్టర్ రాజారెడ్డి, ఎమ్ హెచ్ వో డాక్టర్ రాజేశ్, ఆస్కీ ప్రతినిధి డాక్టర్ రాజ్ మోహన్, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

