
హైదరాబాద్, వెలుగు: టీజీఎస్ఆర్టీసీ సిబ్బందిపై ఎవరైనా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎండీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో రౌడీ షీట్ ఒపెన్ చేస్తామని సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల మోహదీపట్నం నుంచి ఎల్బీ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు కింద పడి గర్భిణి మృతి చెందిన ఘటనను సజ్జనార్ వివరించారు. రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు డోర్ ఒక్కసారిగా తెరవడంతో అది బైక్కు తగిలిందని చెప్పారు.
బైక్ అదుపు తప్పడంతో దానిపై గర్భిణి బస్సు వెనుక టైర్ల కింద పడి చనిపోయారని తెలిపారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ తప్పు ఏమీ లేకపోయినా ఆయనపై కొందరు తీవ్రంగా దాడి చేశారన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయటం, వారిని మనోవేదనకు గురిచేయటం వంటి చర్యలను యాజమాన్యం సహించబోదని స్పష్టం చేశారు. కాగా, తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డ్రైవర్ విద్యాసాగర్ను సజ్జనార్ పరామర్శించారు.