శివ్వంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇంటి బిల్లు మంజూరు చేయించేందుకు ఫీల్డ్ అసిస్టెంట్ రూ.3 వేల లంచం డిమాండ్ చేశాడంటూ లబ్ధిదారులు ఆరోపించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని కొంతాన్పల్లి తండాకు చెందిన బుజ్జికి తొలి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల్లో ఇప్పటికే రూ.3.40 లక్షలు విడుదల కాగా, మరో రూ.1.60 లక్షలు రావాల్సి ఉంది. బకాయి బిల్లు విడుదల కావాలంటే ఇంటి నిర్మాణ పనుల ఫొటోలను తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం రూ.3 వేలు ఇస్తేనే బిల్లు వచ్చేలా చూస్తానని ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ కుల్ల రాములు డిమాండ్ చేశారని లబ్ధిదారులు ఆరోపించారు.
ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్తో జరిగిన సంభాషణను వీడియో తీసి మీడియాకు పంపించారు. ఈజీఎస్ ద్వారా వచ్చే రూ.60 వేల బిల్లుల కోసం ప్రతిసారి ఫొటోలు తీసేటప్పుడు రూ.3 వేలు ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్ ఒత్తిడి చేస్తున్నాడని ఆరోపించారు. కాగా, తాను ఉన్నతాధికారులకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే అడుగుతున్నానని ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పినట్లు బాధితులు పేర్కొన్నారు.
