30 ఎకరాలకు రూ. 30 లక్షల లంచం.. రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన శామీర్ పేట్ తహసీల్దార్

30 ఎకరాలకు రూ. 30 లక్షల లంచం.. రూ.2 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి దొరికిన శామీర్ పేట్ తహసీల్దార్

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట్ తహసీల్దార్ (ఎమ్మార్వో)  సుచరిత రూ. 2లక్షల  లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికింది.  రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలో ఈ మెరుపు దాడులు జరిగాయి.

శామీర్‌పేట్ మండలం అలీయాబాద్ ప్రాంతంలో ఉన్న పలు సర్వే నెంబర్ల భూములను నాలా (NALA) కన్వర్షన్ చేయడం కోసం కొంతమంది రైతులు ప్రయత్నించారు. అయితే, కార్యాలయం చుట్టూ తిరిగినా పని కాకపోవడంతో.. వారు ఒక మధ్యవర్తి ద్వారా ఎమ్మార్వో సుచరితను ఆశ్రయించారు.మొత్తం 30 ఎకరాల భూమిని కన్వర్షన్ చేయడానికి.. ఎకరానికి లక్ష రూపాయల చొప్పున, ఏకంగా 30 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసింది తహసీల్దార్ సుచరిత.

అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేమని రైతులు ప్రాధేయపడటంతో.. లంచం మొత్తాన్ని విడతల వారీగా ఇవ్వాలని ఎమ్మార్వో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, ఈరోజు తొలి విడతగా రెండు లక్షల రూపాయలను ఎమ్మార్వో ఆదేశాల మేరకు ఆమె డ్రైవర్ నాగరాజుకు అందిస్తుండగా.. అప్పటికే నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. డ్రైవర్‌తో పాటు ఎమ్మార్వోను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ప్రస్తుతం శామీర్‌పేట్ ఎమ్మార్వో కార్యాలయంతో పాటు.. సుచరితకు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అవినీతికి పాల్పడితే ఎంతటి వారైనా వదిలేది లేదని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ హెచ్చరించారు.