గండిపేట, వెలుగు: పుట్టుకతోనే అరుదైన గుండె లోపాలతో బాధపడుతున్న ఆఫ్రికాకు చెందిన 8 నెలల చిన్నారి మైజా జిబ్రిల్ బిషీర్కు గండిపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్లు అత్యాధునిక శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. చిన్నారి గుండెలో లోపాల వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీరానికి ఆక్సిజన్ అందకపోవడం, పాలు తాగలేకపోవడం, బరువు పెరగకపోవడం, పెదాలు, చేతివేళ్లు నీలం రంగులోకి మారడం వంటి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తాయి.
సీనియర్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ అమోల్ గుప్త నేతృత్వంలోని డాక్టర్ల బృందం గత నెల 14న బై డైరెక్షనల్ గ్లెన్ అనే క్లిష్టమైన సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. ఈ ఆపరేషన్తో ఊపిరితిత్తులకు రక్తప్రసరణ మెరుగై, ఆక్సిజన్ సరఫరా పెరిగింది. వెంటిలేటర్ అవసరం లేకుండానే చిన్నారి త్వరగా కోలుకుని డిశ్చార్జ్కు సిద్ధమైంది. పిల్లల్లో శ్వాస సమస్యలు, పెదాలు నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్లు సూచించారు.
