నిండు ప్రాణం కాపాడిన ఓ ఫైర్ మేన్ కు బహుమతి అందించి తన పెద్దమనసు చాటుకున్నారు సినీ అగ్ర నటుడు, మెగా స్టార్ చిరంజీవి. హైదరాబాద్ అకాల వర్షాల్లో బాధ్యతగా వ్యవహరించిన ఓ అగ్నిమాపక సిబ్బంది గురించి తెల్సుకుని ప్రశంసించారు.
గత రాత్రి హైదరాబాద్ నగరంలో కురిసిన అకాల వర్షానికి జనజీవనం అతలాకుతలం అయింది. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అధికార యంత్రాంగం ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రమించింది. ఈ క్రమంలో గౌలీగూడలో ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు నుండి కాపాడారు. ఈ విషయాన్ని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి పాపను కాపాడిన ఫైర్మేన్ క్రాంతి కుమార్ ను అభినందించారు.
క్రాంతి కుమార్ కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా అందించారు. ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్ అల్లు అరవింద్ ఈ బహుమతిని అందజేశారు. క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ ఫైర్ సేషన్ ఆఫీసర్ జయరాజ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రమాదానికి గురైన నాలుగేళ్ల బాలికను కూడా ఆదుకుంటామని అల్లు అరవింద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.