గురువును కలసిన మెగాస్టార్ చిరంజీవి 

గురువును కలసిన మెగాస్టార్ చిరంజీవి 

హైదరాబాద్: కళాతపస్వి డైరెక్టర్ కె.విశ్వనాథ్‌‌ను మెగాస్టార్ చిరంజీవి శనివారం కలిశారు. తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు కె.విశ్వనాథ్‌‌‌‌కు మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. విశ్వనాథ్ డైరెక్షన్‌‌లో చిరు నటించిన శుభలేఖ, ఆపద్బాంధవుడు, స్వయంకృషి వంటి సినిమాలు మెగాస్టార్ కెరీర్‌‌లో మైలురాయిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాయి. ఈ మూవీలు మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే గాక.. ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాల్లోనూ అద్భుతంగా నటించి ఏ సినిమాకైనా వన్నె తీసుకురాగలనని నిరూపించాయి.

క్లాసికల్ హీరోగా తనను నిలబెట్టిన విశ్వనాథ్‌‌ను దీపావళి సందర్భంగా సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నారు. తన శిష్యుడు ఇండస్ట్రీ పెద్దగా ఇంటికి రావడంపై విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. చిరు-విశ్వనాథ్ కాసేపు పాత జ్ఞాపకాలను, అప్పటి సినిమా విశేషాలను గుర్తుచేసుకున్నారు. విశ్వనాథ్ ఆరోగ్య క్షేమాలను చిరు అడిగి తెలుసుకున్నారు. ‘విశ్వ‌నాథ్ గారిని క‌ల‌వాల‌నిపించి ఈరోజు ఆయ‌న ఇంటికి వెళ్లా. నాకు ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టిన చిత్రాలను ఆయన తీశారు. పండుగ వేళ ఆయనను క‌ల‌వ‌డం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు’ అని చిరంజీవి అన్నారు.