తెలంగాణలో రెండు రోజులు భారీ వర్షాలు .. 12 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో రెండు రోజులు  భారీ వర్షాలు ..  12 జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 12 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లో కూడా రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. కాగా, అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. 

శనివారం పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. జగిత్యాల, ములుగు, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా భీంగల్‌లో 10.29 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండలో 5.65, హనుమకొండ జిల్లా పరకాలలో 4.9, ఆదిలాబాద్ జిల్లా లోకారి(కె)లో 4.9, నిజామాబాద్ జిల్లా లక్మాపూర్‌‌లో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.