ఏసీబీకి చిక్కిన ఎస్సై, హెడ్​కానిస్టేబుల్

ఏసీబీకి చిక్కిన ఎస్సై, హెడ్​కానిస్టేబుల్

శేరిలింగంపల్లి, వెలుగు: హైదరాబాద్​ లోని మియాపూర్​ ఎస్సై,  ఓ హెడ్​ కానిస్టేబుల్​ లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు మంగళవారం రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి.. మియాపూర్​లో హాస్టల్​ నిర్వహిస్తున్న తాండ్ర అశోక్​కుమార్​, లీల ప్రభు మీద లోకల్​ పోలీసుస్టేషన్​లో ఈ మధ్య ఓ కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో నిందితులకు సహకరించడానికి రూ. 50 వేలు లంచం అడగాలని ఎస్సై యాదగిరిరావు హెడ్​ కానిస్టేబుల్​డి.వెంకట్​రెడ్డికి సూచించారు. దీంతో నిందితుడు అశోక్​కుమార్​ను  హెడ్​ కానిస్టేబుల్​ రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు.  

ఇందుకు అంగీకరించిన బాధితుడు సోమవారం సాయంత్రం హెడ్​ కానిస్టేబుల్​ వెంకట్​రెడ్డికి రూ. 30 వేలు ఇచ్చాడు. ఈ పైసలను ఆయన ఎస్సై యాదగిరిరావుకు ఇచ్చారు. మిగతా రూ. 20 వేలను మంగళవారం సాయంత్రం పోలీసుస్టేషన్​ ఆవరణలో బాధితుడు హెడ్​ కానిస్టేబుల్​కు ఇస్తుండగా అదే టైంలో అక్కడ ఉన్న  ఏసీబీ రంగారెడ్డి జిల్లా రేంజ్​ ఆఫీసర్లు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకుని  హెడ్​ కానిస్టేబుల్​తో పాటు ఎస్సైని అరెస్టు చేశారు.  రూ. 20 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు.