పడగ విప్పిన మైక్రో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ మైక్రో ఫైనాన్స్ ఆగడాలు

పడగ విప్పిన మైక్రో.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మళ్లీ మైక్రో ఫైనాన్స్ ఆగడాలు
  • పేద, మధ్య తరగతి కుటుంబాలే టార్గెట్
  • కిస్తీ లేట్ అయితే చుక్కలే 
  • ఇంటి మీదికి వచ్చి దౌర్జన్యం 
  • టార్చర్ భరించలేక ప్రాణాలు తీసుకుంటున్న బాధితులు

హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైక్రో ఫైనాన్స్ సంస్థల దందా మళ్లీ మొదలైంది. పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని, ఎలాంటి షూరిటీలు లేకుండానే తక్కువ వడ్డీకి లోన్లు ఇస్తామంటూ వివిధ మైక్రో ఫైనాన్స్​సంస్థలు నమ్మిస్తున్నాయి. తీరా లోన్​ తీసుకున్నాక కిస్తీ ఒకరోజు లేట్ అయినా ఇష్టారీతిన ఫైన్లు విధిస్తూ పేదలపై పెనుభారం మోపుతున్నాయి. ఇక ఈఎంఐ కట్టలేని పరిస్థితిలో ఉంటే కలెక్షన్ ఏజెంట్ల ద్వారా వేధింపులకు గురిచేస్తున్నాయి. ఒత్తిళ్లు, అవమాన భారం భరించలేక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి జిల్లాలో జరిగిన ఘటనలు కలకలం రేపుతున్నాయి.

ఒక్కరోజు లేటైతే రూ.వంద వడ్డీ

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఫిన్ కేర్, ఫెడరల్, ముథూట్ మైక్రో ఫైనాన్స్, బజాజ్, శాటిన్ క్రెడిట్​ కేర్ ఫైనాన్స్, ఆర్మన్, స్పందన, ప్రదక్షిణ్, ఫ్రీఛార్జ్, బంధన్, ఐఐఎఫ్​ఎల్, ఫ్యూజన్, సౌత్ ఇండియా, అన్నపూర్ణ, సాక్షగ్రామ్, ఉత్కర్ష్  ఇలా పదుల సంఖ్యలో సంస్థలు మైక్రో ఫైనాన్స్​లోన్లు ఇస్తున్నాయి. పేద, మధ్య తరగతి జనాలే టార్గెట్ గా చేసి, ఐదు నుంచి పది మంది సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ఎలాంటి షూరిటీ లేకుండానే ఆధార్​, పాన్​ కార్డులతోనే లోన్లు ఇస్తూనే దగాకు తెరలేపుతున్నాయి. 

ఒక సభ్యురాలికి రూ.50 వేలు అప్పు ఇచ్చే సమయంలోనే ప్రాసెసింగ్​ ఫీజు, డాక్యుమెంటేషన్, ఇన్సూరెన్స్​పేర్లు చెప్పి రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు కోత పెడుతున్నాయి. ఆ తర్వాత జనాల అవసరాన్ని బట్టి వందకు రూ.3 నుంచి రూ.5 చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాయి. కిస్తీ లేటైతే రోజుకు రూ.వంద చొప్పున ఫైన్ పేరున గుంజుతున్నాయి. తాత్కాలిక అవసరాలకు తీసుకున్న అప్పుకు వడ్డీలు, ఫైన్లు చెల్లించలేక మళ్లీ ఇబ్బందుల పాలవుతున్నారు. 

టార్చర్ భరించలేక సూసైడ్స్..

ఉమ్మడి ఏపీలో మైక్రో ఫైనాన్స్ వేధింపుల కారణంగా కొంతమంది ప్రాణాలు తీసుకోగా అప్పటి సీఎం వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకున్నారు. మైక్రో ఫైనాన్స్ వసూళ్లపై తాత్కాలికంగా నిషేధం విధించగా,  ఆయన మరణం తర్వాత అప్పటి ప్రభుత్వం వడ్డీ రేట్లు నియంత్రించడంతోపాటు బలవంతపు వసూళ్లపై ఒక ఆర్డినెన్స్​ తీసుకొచ్చింది. దాని ప్రకారం వేధింపులకు పాల్పడే మైక్రో ఫైనాన్స్​సంస్థలకు రూ.లక్ష జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. 

కానీ దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ ఆర్డినెన్స్ కూడా కొద్దిరోజులకే పరిమితం అయ్యింది. మైక్రో ఫైనాన్స్ సంస్థల దందా షరా మామూలే అయిపోయింది. దీంతో మైక్రో ఫైనాన్స్​ సంస్థల టార్చర్ భరించలేక ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలువురు బాధితులు ప్రాణాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మైక్రో ఫైనాన్స్ బాధితులు పెరిగిపోతున్నారు. ఇకనైనా వారి వేధింపులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.

ధర్మసాగర్ మండల కేంద్రానికి చెందిన మేకల సుచిత-సందీప్ దంపతుల వద్దకు కొంతకాలం కింద ఓ మైక్రో ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఏజెంట్స్​వచ్చి ఆధార్​ కార్డు ఉంటే చాలు లోన్ ఇస్తామని ఆశపెట్టారు. దీంతో రూ.50 వేలు అప్పు తీసుకోగా, ఆ తర్వాత మరో సంస్థ రూ.70 వేలు, ఇంకోసంస్థ రూ.40 వేలు ఇచ్చాయి. కానీ, మైక్రో ఫైనాన్స్ కలెక్షన్​ఏజెంట్లు కిస్తీల కోసం వేధించడంతో గత మార్చిలో సందీప్ పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లగా, కోలుకొని వచ్చిన కొద్దిరోజులకే మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. టార్చర్ భరించలేక సందీప్​ తన రేకుల ఇంటిని అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొనేవారు లేకపోవడంతో ఆ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను వదిలేసి సందీప్​ దంపతులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇంట్లో ఆరోగ్య పరిస్థితి బాగోలేని వృద్ధులు ఉంటుండగా, కలెక్షన్​ ఏజెంట్లు వారినీ వదలకుండా వేధిస్తుండటం గమనార్హం.

హనుమకొండ జిల్లా పరకాల మండలం పోచారానికి చెందిన ఇప్ప లావణ్య-కిరణ్​ దంపతులది నిరుపేద కుటుంబం. వారి అవసరాలను ఆసరాగా చేసుకున్న మైక్రో ఫైనాన్స్​సంస్థలు లోన్లు ఇస్తామంటూ నమ్మించాయి. వారు వివిధ సంస్థల నుంచి రూ.లక్ష వరకు అప్పు తీసుకోగా, ఆర్థిక పరిస్థితి బాగోలేక రెండు నెలలుగా కిస్తీలు కట్టలేదు. దీంతో ఈ నెల 3, 4, 5వ తేదీల్లో వివిధ సంస్థల సిబ్బంది వచ్చి కిస్తీ కట్టకపోతే సిబిల్ పోగొడతామని, ఇంటికి తాళం వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. మనస్తాపానికి గురైన లావణ్య శుక్రవారం గడ్డి మందు తాగగా, పరకాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.