జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సేఫ్

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సేఫ్

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు తృటిలో  రోడ్డు ప్రమాదం తప్పింది. ఆయన వెళ్తున్న కారును మరో కారు ఢీ కొట్టింది. దీంతో మంత్రి కారు టైర్ ఊడిపోయింది. మంత్రి లక్ష్మణ్ స్వల్ప గాయాలతో సేఫ్ గా బయటపడ్డారు. 

అసలేం జరిగిందంటే.. జగిత్యాల జిల్లా  మెట్ పల్లి  నుంచి ధర్మపురి వెళ్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్  కారును  మారుతీ నగర్ దగ్గర మరో కారు ఢీ కొట్టింది. దీంతో మంత్రి కారు ముందు టైరు ఊడిపోయింది. అదుపు తప్పిన మంత్రి కారు రోడ్డు పక్కకు  దూసుకెళ్లింది . ఈ ఘటనలో మంత్రి కారు స్వల్పంగా ధ్వంసం అయ్యింది. మంత్రి లక్ష్మణ్ కూడా స్వల్ప గాయాలతో సేఫ్ గా బయటపడ్డారు. తర్వాత వేరే కారులో మంత్రి  ధర్మపురికి వెళ్లారు.

జడ్పీటీసీ నుంచి మంత్రిగా 

జూన్ 8న అడ్లూరి లక్ష్మణ్ ఫస్ట్ టైం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అడ్లూరి లక్షణ్ కుమార్ 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడారం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.  ఆ తర్వాత ధర్మారం జడ్పీటీసీగా మాజీ మంత్రి మాతంగి నర్సయ్యపై గెలుపొందారు. నియోజకవర్గ పునర్విభజన తర్వాత ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 1,365 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటికే జడ్పీటీసీ గా ఉన్న ఆయన కరీంనగర్ జడ్పీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పని చేశారు. తెలంగాణ వచ్చాక జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2018 నుంచి జగిత్యాల డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తన చిరకాల ప్రత్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ధర్మపురి నుంచి 22,039 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత ప్రభుత్వ విప్ గా ఎన్నికయ్యారు. 2025లో ఆయనను మంత్రి పదవి వరించింది