ప్రజలకు మెరుగైన వైద్యం అందించండి : మంత్రి దామోదర రాజనర్సింహ

ప్రజలకు మెరుగైన వైద్యం అందించండి : మంత్రి దామోదర రాజనర్సింహ
  •     ట్రాన్స్​ఫర్​, డిప్యుటేషన్​ పేరుతో వైద్య సేవలకు ఆటంకం కలిగించొద్దు
  •     గవర్నమెంట్​ డాక్టర్లకు మంత్రి దామోదర రాజనర్సింహ సూచన
  •     కోఠిలో తెలంగాణ వైద్యభవన్​ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: ‘ట్రాన్స్​ఫర్, డిప్యుటేషన్​అంటూ తిరుగుతూ.. వైద్య సేవలకు ఆటంకం కలిగించకండి.. డాక్టర్ల జెన్యూన్ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం పరిష్కరిస్తుంది.. కానీ, ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌లోనే పోస్టింగ్ కావాలంటే ఎలా ఇవ్వగలం?’ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం కోఠిలో తెలంగాణ వైద్య భవన్​ను ఆయన ప్రారంభించారు. 

అనంతరం మాట్లాడుతూ.. ట్రాన్స్ ఫర్​ప్రక్రియను పారదర్శకంగా కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తూ నచ్చిన చోట పోస్టింగ్ ఎంచుకునే అవకాశం కల్పించామన్నారు. అయితే, జిల్లాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు సహకరించాలని సూచించారు. ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, మందులు, ఎక్విప్‌మెంట్ ప్రభుత్వం సమకూరుస్తోందని తెలిపారు. జూనియర్ డాక్టర్ల స్టైపెండ్, సీనియర్ రెసిడెంట్ల గౌరవ వేతనాలను 15 శాతం పెంచామని పేర్కొన్నారు.

రెండేండ్లలో 10,327 నియామకాలు చేశాం

దశాబ్దాల ఆకాంక్షను నెరవేరుస్తూ గోషామహల్‌లోని 26 ఎకరాల్లో సుమారు రూ.3 వేల కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి నిర్మిస్తున్నామని, ఇది రాష్ట్ర ఆరోగ్య రంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. అలాగే,  వైద్య విధాన పరిషత్‌ ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌ గా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డీపీహెచ్, టీవీవీపీలో పని చేస్తున్న స్పెషలిస్టులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అవకాశం కల్పించామన్నారు. గత రెండేండ్లలో ఆరోగ్య శాఖలో 10,327 నియామకాలను పూర్తి చేశామని, మరో 6 వేలకు పైగా పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. 

నార్మల్​ డెలివరీలను ప్రోత్సహించడమే లక్ష్యం

రాష్ట్రంలో సిజేరియన్లను తగ్గించి, నార్మల్ డెలివరీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో త్వరలోనే మిడ్ వైఫరీ ట్రైనింగ్ ప్రారంభిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. బోయగూడ మిడ్‌ వైఫరీ ట్రైనింగ్ ఇన్​స్టిట్యూట్‌ లో నిర్వహించిన సేఫ్ మదర్ హుడ్ డేకు హాజరయ్యారు. గర్భిణులకు మెరుగైన వైద్య సేవలందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఇప్పటికే 370 మంది నర్స్​లకు మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇచ్చామని, త్వరలో మరిన్ని ఇన్​స్టిట్యూట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనీమియా ముక్త్​భారత్ కార్యక్రమంలో రాష్ట్రం ముందంజలో ఉందని మంత్రి పేర్కొన్నారు.