అమ్రాబాద్, వెలుగు: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ హౌజ్ ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహా ఆదివారం సందర్శించారు. ముందుగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో దోమలపెంట వద్ద తెలంగాణ పవర్ హౌజ్ ను పరిశీలించారు. మూడేండ్ల కింద పవర్ హౌజ్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించారు. 9 మంది జెన్కో ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు.
జీరో ఫ్లోర్ కు వెళ్లి క్షేత్ర స్థాయి విద్యుత్ ఉత్పత్తిని పరిశీలించారు. మెయిన్ కంట్రోల్ రూం ఉత్పత్తి, నిర్వహణ పద్ధతులను జెన్కో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక ప్రజల సమస్యలు తీర్చేందుకు రాములమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ అంబులెన్స్, స్ట్రీట్ లైట్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ సేవలను మంత్రి ప్రారంభించారు. ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ విజ్ఞప్తి మేరకు దోమలపెంట వద్ద రూ.20 లక్షల వ్యయంతో పల్లె దవాఖానా, అంబులెన్స్ ఏర్పాటుకు శంఖుస్థాపన చేశారు. ఎంపీటీసీ బెజ్జం మల్లికార్జున్ రావు, సర్పంచ్ ఛత్రునాయక్, డీఈలు శ్రీనివాసులు, సుధాకర్, రమేశ్ పాల్గొన్నారు.