కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిన్నారుల మిస్సింగ్ తీవ్ర కలకలం రేపింది. శనివారం (మార్చి 7) ఒకేరోజు ఐదుగురు చిన్నారులు అదృశ్యమయ్యారు. వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన సింహాద్రి (10), విజయ్ (09) అనే ఇద్దరు చిన్నారులు తప్పిపోయారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారులు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. చుట్టు పక్కలా, బంధువులను ఆరా తీశారు.
కానీ ఎక్కడ ఆచూకీ దొరకకపోవడంతో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చిన్నారుల తల్లిదండ్రులు. ఇదిలా ఉండగానే.. జిల్లా కేంద్రంలోని ఆర్బీనగర్ కాలనీకి చెందిన ముగ్గురు అక్క చెల్లెలు సీపాత్ (08), ఆయాత్ (07), మరియం(05) తండ్రితో కలిసి ఆటోలో బయటకు వెళ్లారు. తినుబండరాల కోసం బయటకు వెళ్లిన ముగ్గురు తిరిగి ఇంటికి రాలేదు.
దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పిల్లల మిస్సింగ్పై కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. బాధిత కుటుంబాల ఇంటి దగ్గరకు వెళ్లి కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు సేకరిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 24 గంటల వ్యవధిలోనే ఐదుగురు పిల్లలు అదృశ్యమవ్వడం జిల్లా కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.
