రైతుల నోటికాడి బుక్కను లాగేసిన్రు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు

రైతుల నోటికాడి బుక్కను లాగేసిన్రు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు

పెద్దపల్లి, వెలుగు: బ్యాంకు ఖాతాల్లో పడ్డ రైతుభరోసా డబ్బులను రైతులు డ్రా చేసుకోకుండా బీజేపీ కుట్ర చేసి ఆపేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు మండిపడ్డారు. రైతుల నోటికాడి బుక్కను లాగేశారని.. దీనికి బీజేపీ, బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంగళవారం ఆయన మీడియాతో మట్లాడారు. చెప్పిన టైం కంటే ముందే సీఎం రేవంత్​రెడ్డి రైతుల ఖాతాల్లో డబ్బులు వేశారని.. కానీ, ఖాతాల్లో పడ్డ డబ్బులను రైతులు డ్రా చేసుకోకుండా ఎలక్షన్​ కమిషన్​ను అస్త్రంగా చేసుకొని బీజేపీ కుట్ర చేసిందని ఆయన ఫైర్​ అయ్యారు. 

రైతుభరోసా ఆన్​గోయింగ్​ స్కీం అని ఈసీకి తెలియదా? అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీకి మొదటి నుంచీ రైతులు అంటే ద్వేషమని అన్నారు. గతంలో  కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చేందుకు ప్రయత్నించి వందల మంది రైతులను పొట్టన పెట్టుకుందన్నారు. బీఆర్ఎస్​ గత పదేండ్లలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిపోయిందన్నారు. కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిధులను ఆచీతూచి ఖర్చు చేస్తున్నదని తెలిపారు. 

ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులను ఆదుకోవాలని బ్యాంకులలో రైతుభరోసాకు సంబంధించిన నిధులను జమచేశామన్నారు. బీజేపీ కుట్రలను రైతులు గమనించాలన్నారు. 2018లో ఎన్నికల రోజున ఆనాటి కేసీఆర్​ ప్రభుత్వం రైతుబంధు డబ్బులను ఖాతాలలో వేసిందని గుర్తుచేశారు. అప్పుడు బీజేపీ నోరుమెదపలేదని,  ఎందుకంటే బీజేపీ, బీఆర్ఎస్​ రెండు ఒకటేనని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో మంథని మున్సిపల్​ చైర్​ పర్సన్​ పెండ్రు రమా, ఎంపీపీ కొండ శంకర్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.